
గత ఆదివారం నుంచి ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన NRI డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కత్తితో దాడి చేసి చంపిన దుండగులు ఆమె మృతదేహాన్ని సూట్కేస్లో కుక్కి సిడ్నీలోని సౌత్ వేల్స్ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న ఆమె కారులోనే వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజు బుధవారం ఆమె మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష్ నర్డే కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాదం జరిగిన తీరు పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రీతి రెడ్డిని మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష్ నర్డే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రీతిరెడ్డి… సిడ్నీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్ బ్రూక్ డెంటల్ హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తోంది. ఇందులో భాగంగా సెయింట్ లియోనార్డ్స్లో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్కు హాజరయ్యేందుకు గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన ప్రీతిరెడ్డి మళ్లీ కన్పించలేదు. చివరి సారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమె 11 గంటల కల్లా ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్లు తెలిసింది. కానీ ఎంతకి ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రీతిరెడ్డి అదృశ్యం, హత్య వెనక మిస్టరీ ఉన్నట్లు భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు చివరిసారిగా సిడ్నీలోని మార్కెట్ స్ట్రీట్లో మెక్ డోనాల్డ్కు ప్రీతి వెళ్లినట్లు.. ఆ సమయంలో ఆమెతో పాటు హర్ష్ నర్డే కూడా ఉన్నట్లు గుర్తించారు.
