- వారంరోజుల్లో ఇంటర్నేషనల్ మీటింగ్ నిర్వహిస్తామని వెల్లడి
లండన్: హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు దౌత్యపరంగా, రాజకీయపరంగా సాధ్యమైన చర్యలు తీస్కుంటామని బ్రిటన్ తెలిపింది. 35 దేశాలను ఏకతాటిపైకి తెచ్చి క్రూడ్ ఆయిల్ రవాణా మార్గంలో సముద్ర భద్రతను పునరుద్ధరించేందుకు కలిసి పనిచేస్తామని ఈ మేరకు ప్రధాని కీర్ స్టార్మర్ బుధవారం ప్రకటించారు.
అందుకు అనుగుణంగా ఉమ్మడి ప్రకటనపై 35 దేశాలు సంతకం కూడా చేశాయని తెలిపారు. ప్రపంచ దేశాలకు ఆయిల్, గ్యాస్ రవాణాలకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధిలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను తొలగించేందుకు ప్రయత్నించాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్తో పాటు మొత్తం 35 దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశాయన్నారు.
అక్కడ మునుపటి పరిస్థితి తీస్కొస్తం
హార్మూజ్ మార్గాన్ని ఓపెన్ చేసేందుకు తీస్కోవాల్సిన చర్యలపై ఈ వారంలోనే అంతర్జాతీయ దౌత్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కీర్ స్టార్మర్ ప్రకటించారు. నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ధరించడం, చిక్కుకున్న నౌకలను భద్రంగా గమ్యానికి చేర్చడం, ఓడల్లో నావికుల భద్రకు హామీ ఇవ్వడం, అవసరమైన వస్తువుల రవాణా మునుపటిలాగే సజావుగా జరిగేలా చూడటమే ఈ సమవేశం లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ లక్ష్యాలను నెరవేర్చేందుకు కావాల్సిన కార్యాచరణను రూపొందిస్తామన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత హార్మూజ్ మార్గంలో ఎలాంటి అలజడులు లేకుండా ఉండేలా సైనిక ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తామని అన్నారు. అందుకు సైనిక అధికారుల సమావేశం కూడా నిర్వహిస్తామని తెలిపారు.
