సింగరేణి విద్యుత్ ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి..అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం 

సింగరేణి విద్యుత్ ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి..అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం 
  • ప్రాజెక్టుల పర్యవేక్షణకు డాష్ బోర్డు ఏర్పాటు 
  • సింగరేణి ప్రమాద బీమా దేశానికి ఆదర్శమని కామెంట్

హైదరాబాద్, వెలుగు: సింగరేణి చేపడుతున్న సోలార్, విండ్, హైడల్ పవర్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, అన్నింటినీ నిర్ణీత కాలపరిమితిలోపే పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ప్రజా భవన్‌‌‌‌‌‌‌‌లో సింగరేణి విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా చేపట్టిన 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు, 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు.

ఈ ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఎనర్జీ డిపార్ట్​మెంట్​కు సంబంధించిన అన్ని విభాగాల కోసం డాష్‌‌‌‌‌‌‌‌బోర్డు రూపొందించాలని ఆదేశించారు. లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌పై 300 మెగావాట్లు, మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌పై 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతుల కోసం సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరపాలని చెప్పారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన డీపీఆర్ వచ్చే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.

రామగుండం-1 ఏరియాలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ నీటి సంపుపై 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం ప్రకారం సోలార్ వ్యాలీలో 1,500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటును త్వరితగతిన చేపట్టాలని, ఈ అంశాన్ని కేబినెట్‌‌‌‌‌‌‌‌లో చర్చించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సింగరేణి బీమా దేశానికి ఆదర్శం  

సింగరేణి అమలు చేస్తున్న ఉచిత ప్రమాద బీమా పథకం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రామగుండం-1 ఏరియాకు చెందిన సపోర్ట్‌‌‌‌‌‌‌‌మాన్ పెండ్రి రంజిత్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆయన భార్య లతకు ఈ పథకం కింద రూ.1.20 కోట్ల బీమా సొమ్ము చెక్కును డిప్యూటీ సీఎం శనివారం ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌లో అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుని కుటుంబంలో ఒకరికి త్వరలో కారుణ్య నియామక పత్రం కూడా అందజేస్తామన్నారు. సింగరేణి అమలు చేస్తున్న రూ.1.20 కోట్ల ప్రమాద బీమా పథకం ప్రభుత్వరంగ సంస్థలకే కాకుండా, ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందన్నారు. సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ మాట్లాడుతూ.. దేశంలో రూ. 1.25 కోట్ల బీమా పథకాన్ని అమలు చేసిన మొదటి ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి నిలిచిందన్నారు. 

సింగరేణి లక్ష్యం 7 వేల మెగావాట్లు.. 

గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ వంటి ఇతర ప్రాజెక్టులపై కూడా డిప్యూటీ సీఎం సమీక్షించారు. సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా పవర్ ప్రాజెక్టుల గురించి వివరించారు. సింగరేణి సంస్థ ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కోరారు. ఈ వ్యాపార విస్తరణ చర్యలు సంస్థకు సుస్థిర భవిష్యత్తును అందిస్తాయన్నారు. సమావేశంలో ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, రెడ్కో వీసీ ఎండీ అనిల, సింగరేణి ఈడీ ఎస్ డీఎం సుభానీ, ఈడీ(ఎస్టీపీపీ) చిరంజీవులు, జీఎంలు జానకీ రామ్, శ్రీనివాసులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.