
- లిథియం అన్వేషణపై ఫోకస్ పెట్టాలి
- ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్ బ్యాటరీలదే..
- అవసరమైతే కన్సల్టెన్సీని నియమించుకోండి
- సింగరేణి డెవలప్మెంట్పై సమీక్షలో డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: కోల్ ప్రొడక్షన్లో ఎక్స్పర్ట్ గా ఉన్న సింగరేణి.. ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. సింగరేణి ఫ్యూచర్ ప్లాన్, డెవలప్మెంట్పై శనివారం సెక్రటేరియెట్లో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ మేరకు సంస్థ అధికారులకు పలు సూచనలు చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్, బొగ్గు లాంటి ఇంధన వనరులకు కాలం చెల్లుతున్నది. భవిష్యత్ అంతా విద్యుత్ బ్యాటరీలే కేంద్రంగా మారుబోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో లిథియం వంటి అనేక మూలకాల అన్వేషణ, వాటి మైనింగ్పై సింగరేణి దృష్టి సారించాలి. మెటల్స్, నాన్ మెటల్స్ మైనింగ్ లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ఇందుకోసం అవసరమైతే ఒక కన్సల్టెన్సీని నియమించుకోవాలి. సింగరేణి తన మనుగడను కొనసాగిస్తూ ఆస్తులు సృష్టించుకోవాలి. సంస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు -ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుంది’’అని భట్టి విక్రమార్క అన్నారు.
గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్రంలో ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నట్లు సింగరేణి అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. వీటిపై పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ లు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలో వాటిని ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. ఒడిశాలోని నైనీ బ్లాక్ లో ఎప్పటి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తారని సింగరేణి అధికారులను భట్టి అడిగి తెలుసుకున్నారు. ఈ రివ్యూ మీటింగ్లో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్, సింగరేణి సీఎండీ బలరామ్ తదితరలు పాల్గొన్నారు.