
- ఇక ప్రతివారం రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ భేటీ: భట్టి
హైదరాబాద్, వెలుగు : నిధుల సమీకరణ పై అధికారులు దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. గురువారం సెక్రటేరియెట్లో రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యుడు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రతివారం నిర్వహిస్తామని భట్టి తెలిపారు. తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ నిర్ణయాలు, వాటి ప్రగతిని వచ్చేవారం సమావేశంలో అంశాలవారీగా సమీక్షిస్తామని తెలిపారు. తాజా సమావేశంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాలు, వాటి పురోగతిని నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నియమించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
సమావేశంలో శాఖలవారీగా అంశాలను డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, సీసీఎల్ ఏ సెక్రెటరీ నవీన్ మిట్టల్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ , కమిషనర్లు హరిత, హరికిరణ్, విష్ణువర్ధన్, సురేంద్ర మోహన్, బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఇలంబర్తి , ఆర్. వి. కర్ణ న్ తదితరులు పాల్గొన్నారు.