
- జూన్ 2న సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల చేతుల మీదుగా
- శాంక్షన్ లెటర్స్: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు రాజీవ్ యువ వికాసం దోహదపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత పదేండ్లలో కార్పొరేషన్ల ద్వారా మొక్కుబడిగా కార్యక్రమాలు జరిగాయని, కానీ ప్రజా ప్రభుత్వం రూపొందించిన ఈ పథకం పూర్తిగా భిన్నమని చెప్పారు. బుధవారం సాయంత్రం మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పథకం అమలు పురోగతిని భట్టి విక్రమార్క సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 8 వేల కోట్ల పెట్టుబడితో 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నామని, దీనివల్ల మానవ వనరుల వినియోగం, వ్యాపార కార్యకలాపాలు విస్తృతమై జీడీపీ పెరుగుతుందని వివరించారు.
ఈ పథకం విజయవంతానికి అధికారులు కృషి చేయాలని, లబ్ధిదారుల వ్యాపారాల్లో ఇబ్బందులుంటే వెంటనే జోక్యం చేసుకొని పునరుద్ధరించాలని ఆదేశించారు. మండలస్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి, లబ్ధిదారులను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన సహాయం అందించాలని సూచించారు. జూన్ 2న సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ప్రతి నియోజకవర్గంలో యువ వికాసం శాంక్షన్ లెటర్లు పంపిణీ చేయాలని, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమంతోపాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎస్సీ, బీసీ వర్గా లకు చట్టపరమైన రిజర్వేషన్లు అమలయ్యేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.