
- ఒక్క ఏడాదిలోనే రూ.70 వేల కోట్లు ఖర్చు చేసినం
- రాజకీయ జోక్యం వల్లే కాళేశ్వరం కూలింది
- భూపాలపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేయనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కట్టిన ఏ ప్రాజెక్టుకు పగుళ్లు రాలేదని, బీఆర్ఎస్ లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ఎందుకు కూలిందని ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలోని చెన్నపూర్ లో రూ.1.50 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించి, మరో మూడు విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంజూరు నగర్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లీడర్లు ప్రచారం చేశారని, ప్రస్తుతం కరెంట్ లెక్కలు చూసైనా వాళ్లు కళ్లు తెరవాలన్నారు.
2023 మార్చిలో అత్యధికంగా 15 వేల మెగావాట్ల డిమాండ్ ఉండగా.. ఈ ఏడాది మార్చిలో 17,162 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. ఒకే నెలలో 2 వేల మెగావాట్ల డిమాండ్ పెరిగినా ఒక్క నిమిషం కరెంట్ పోకుండా సప్లై చేశామన్నారు. రైతులకు ఉచిత కరెంట్ కోసం ఏటా రూ.11,500 కోట్లు, ఇండ్లకు 200 యూనిట్లు, ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు ఉచిత కరెంట్ కోసం ఏటా రూ.13,992 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఒక్క ఏడాదిలోనే రూ.70 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.
రుణమాఫీకి రూ.21 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.13,600 కోట్లు ఖర్చు చేశామని, వచ్చే తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతులకు అందిస్తామని చెప్పారు. రూ.38 వేల కోట్ల అంచనాతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని బీఆర్ఎస్ సర్కారు రూ.1.25 లక్షల కోట్లకు పెంచి ప్రజాధనాన్ని దోచుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యత లేకుండా కట్టారని డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు. ఇంజనీర్ల పనిలో ప్రభుత్వ పెద్దల జోక్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.
బీఆర్ఎస్కు నైతిక హక్కు లేదు: మంత్రి శ్రీధర్ బాబు
గోదావరి నీళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ వాళ్లకు లేదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బనకచర్లపై కేంద్రమంత్రితో తాము ఇప్పటికే మాట్లాడామని, గోదావరి నీళ్లలో మహారాష్ట్ర, ఏపీలకు రాష్ట్ర వాటా నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఇచ్చేదిలేదన్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మ , ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పాల్గొన్నారు