ఆధ్యాత్మికం: ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రత్యేకం.. నెల రోజుల వ్రత విధానం ఇదే..!

ఆధ్యాత్మికం:  ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రత్యేకం.. నెల రోజుల వ్రత విధానం ఇదే..!

కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల మహాలక్షి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది ధనుర్మాసం డిసెంబర్​ 16న ప్రారంభమై వచ్చే సంవత్సరం (2026) జనవరి 14 వరకు ఉంటుంది పండితులు చెబుతున్నారు.  మరి ఈ నెల రోజులు విష్ణుమూర్తిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. . .!

సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - "ధనుర్మాసం". వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. 

గోదాదేవి రచించిన ..తిరుప్పావై..ని ఈనెల  రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు  ( 2025 డిసెంబర్​ 16 నుంచి 2026 జనవరి 14 వరకు) సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి. 

ధనుర్మాసంలో  మొదటి 15 రోజులు  విష్ణుమూర్తిని  పూజించి  నైవేద్యంగా పులగం ...  చెక్కరపొంగలిని, చివరి 15 రోజులు దద్దోజనం ( పెరుగన్నం)  సమర్పించాలి.  ఈ నెల అంతా  పొద్దున్నే ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి... ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం.

ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. 

ధనుర్మాసం.. పూజా విధానం

  • ధనుర్మాసం నెల రోజులు.. కార్తీకమాసంలో శివుడిని పూజించిన విధంగా.. వైష్ణవ సాంప్రదాయంలా విష్ణుమూర్తిని పూజిస్తూ.. ఈ నెలరోజుల పాటూ .. ధనుర్మాసవ్రతం..  ఆచరించాలి. 
  • ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.   ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది.
  • ధనుర్మాసం వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహలాతోగాని, రాగితో గానీ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని  తయారుచేయించుకుని  లేదా చిత్ర పటాన్ని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. 
  • విష్ణువును 'మధుసూదనుడు' అనే పేరుతో వ్యవహరించాలి.
  •  ప్రతి రోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. 
  • అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. 
  • తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. 
  • నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ చెక్కర పొంగలి ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ ..దద్దోజనం.. నైవేద్యంగా సమర్పించాలి. 
  •  ధూప, దీప, దక్షిణ, తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. 
  • మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని  పూజించాలి. 

ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ( 2026 జనవరి 14 వరకు)  ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.