ఆధునిక కాలంలో జనాలు కొద్దిపాటి ఒత్తిడి వస్తే చాలు.. ఏదో అయిపోయిందని ఆందోళన చెందుతున్నారు. విషయం ఏమీ లేకపోయినా సరే తెగ గాబరా పడుతున్నారు. ఎలాగు ఆఫీసు పని.. కుటుంబం.. ఆరోగ్యం అనేక సమస్యలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనసుకు చాలా ప్రశాంతత అవసరం. అందుకే పెద్దలు ఎంతో కొంత సేపు ధ్యానం చేసి .. పూజ చేస్తూ సమయాన్ని బట్టి కొన్ని పవర్ ఫుల్ మంత్రాలను పఠించే వారు. ఇలా చేయడం వలన మనసుకు ప్రశాంతత ఏర్పడి.. ఆందోళన .. ఒత్తిడి దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో జనాలు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలామంది వారి మతానుసారంగా రోజు ఎంతో కొంత సమయం ధ్యానం.. పూజ చేస్తుంటారు. అయితే ఆ సమయంలో ఇష్ట దైవాన్ని.. కుల దైవాన్ని ప్రార్థిస్తూ.. శక్తివంతమైన మంత్రాలు పఠిస్తూ.. ఆందోళనను, టెన్షన్.. ఒత్తిడిని దూరం చేసుకుంటారు. ముఖ్యంగా గణేశ మంత్రం, గాయత్రి మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం రోజూ చదువుతూ ఉంటే జీవితంలో మంచి మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు.
గణేశ మంత్రం : ఓం శ్రీ గణేశాయ నమః అనే గణేశ మంత్రంరోజును ప్రారంభించే ముందు అనగా నిద్ర లేచిన తరువాత భూమాతకు నమస్కరించి.. తూర్పు దిక్కుకు తిరిగి మనస్సులో విఘ్నేశ్వరుడిని తలచుకొని 11 సార్లు జపించాలి. ఈ మంత్రం జపించడం వల్ల మనసులో ఉన్న భయం, సందేహాలు తగ్గుతాయి. ఆ తరువాత కాలకృత్యాల అనంతరం దేవుని మందిరం దగ్గర.. 11 సార్లు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరదవరద సర్వజనమే వశమానాయ స్వాహాః అని చదవాలి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ఎవరికైనా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించే ముందు ఈ మంత్రం జపిస్తే మనసు స్థిరంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది.
గాయత్రి మంత్రం : ఈ మంత్రానికి చాలా శక్తి ఉందని పండితులు చెబుతున్నారు. అయితే పురాణాల ప్రకారం ఈ మంత్రాన్ని జపించాలంటే కచ్చితంగా ఉపనయన సంస్కారం కావాలి. ఉపనయనం కాని వారు ఈ మంత్రాన్ని పఠించకూడదు. ఇక ఉపనయనం అయిన వారు ఓం భూర్భువః స్వః... అని ప్రారంభమయ్యే గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. మిగతా వారు ఓం కారాన్ని జపించాలి. వీటివలన మేథాశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చదువులో ఫోకస్ పెరగాలని కోరుకునే విద్యార్థులకు ఇది చాలా ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే శ్వాస సవ్యంగా సాగి శరీరానికి ఒక రిలాక్స్ ఫీలింగ్ వచ్చి చాలా ఆరోగ్యంగా ఉంటారు.ప్రతి పనిలో కూడా ఏకాగ్రత ఏర్పడి.. మనసు చెల్లాచెదురుగా తిరిగే ఆలోచనల నుంచి బయటపడుతుంది. ఇంకా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది
మహా మృత్యుంజయ మంత్రం : ఇది పరమేశ్వరునికి సంబంధించినది. “ఓం త్య్రంబకం యజామహే.” అనే మంత్రాన్ని జపించడం వల్ల భయం తగ్గి మనసులో ధైర్యం.. మానసిక బలం పెరుగుతుంది. ఈ మూడు మంత్రాలను రోజుకు 11 నిమిషాలు లేదా 11 సార్లు శ్రద్ధతో జపం చేస్తే మనసు ప్రశాంతంగాఉంటుంది.రోజువారీ జీవితంలో చిన్న అలవాటుగా చేసుకుంటే చాలా మంచిదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

