హైదరాబాద్:నగరంలోని అంబర్ పేట్ లో పీటీవో ప్రాంగణంలో పోలీసు డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో కొత్త పెట్రోల్ బంక్ కు శంకుస్థాపన చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. జాతీయ రహదారి 44 పక్కన ఇండియన్ ఆయిల్ భాగస్వామ్యంతో TG పోలీస్ వెల్ఫేర్ ఫ్యూయెల్ అవుట్ లెట్ ను పోలీస్ సంక్షేమ నిధులతో ఏర్పాటు చేస్తున్నారు. పిటిఓ ప్రాంగణంలో 30 రోజుల్లో అన్ని అనుమతులతో 4నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
జాతీయ రహదారి 44 పక్కన 2025 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ బంక్ ను నిర్మిస్తున్నారు. ఈ ఫ్యూయల్ ఔట్లెట్ పోలీస్ సంక్షేమ సొసైటీకి ఆదాయం అందించి సంస్థాగత అభివృద్ధికి దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.
మరోవైపు రూ.59 కోట్లతో అంబర్పేట్లో కొత్త పిటిఓ నిర్వహణ & మరమ్మత్తు విభాగ భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. 21 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారు. ఈ కొత్త భవనంలో వర్క్షాప్లు, డయాగ్నస్టిక్ సిస్టమ్స్, మెయింటెనెన్స్ బ్లాక్లు, ఆపరేషన్ జోన్లు, ప్రత్యేక శిక్షణ సదుపాయాలు ఉండనున్నాయి. వీటితో పోలీస్ వాహనాల రెడీనెస్ & ఎమర్జెన్సీ స్పందన వేగం మరింత మెరుగవుతుందని డీజీపీ తెలిపారు.
