దుబాయ్: ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధూ దుబాయ్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ కోసం ఇంగ్లాండ్ వెళ్తుండగా మిడిల్ ఈస్ట్లో సైనిక దాడుల కారణంగా దుబాయ్ ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ కంట్రీస్పై ఇరాన్ బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. యుద్ధం గంట గంటకు మరింత ముదురుతుండటంతో మిడిల్ ఈస్ట్లో విమాన ప్రయాణాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
యుద్ధం తీవ్రరూపం దాల్చుతుండటంతో విమాన ప్రయాణాలు ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఇంకా దుబాయ్లోనే ఉన్న సింధూ 2026, మార్చి 3 నుంచి మొదలుకానున్న ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్కు దూరమయ్యే అవకాశం ఉంది. దీనిపై సింధూ కోచ్ విమల్ కుమార్ మాట్లాడుతూ.. సింధూ చాలా నిరాశగా ఉందని చెప్పారు.
ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ కోసం చాలా కష్టపడి శిక్షణ పొందిందని.. టోర్నీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిందని తెలిపారు. దుబాయ్ నుంచి రోడ్డు మార్గంలో ఒమన్ వెళ్లి అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్లాలని ఆలోచించామని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 6 గంటల రోడ్డు ప్రయాణం ప్రమాదకరమని అధికారులు చెప్పారన్నారు.
సింధూ హోటల్ లో కూడా టైమ్ వేస్ట్ చేయకుండా టోర్నీ కోసం ప్రిపేర్ అయ్యిందన్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని.. యుద్ధం వల్ల మధ్యలో చిక్కుకుపోయిన ఆటగాళ్లను సర్దుబాటు చేయడానికి అత్యవసర పరిస్థితులను సిద్ధం చేస్తున్నామని బీడబ్ల్యూఎఫ్ధృవీకరించింది.
