
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీలో నాగార్జునతోపాటు తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు. ఇవాళ (జూన్ 20) కుబేర మూవీ.. వరల్డ్ వైడ్గా థియేటర్లలో విడుదలైంది.
ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్పై ప్రముఖ సినీ నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్, నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
తెలుగు, తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాతో వచ్చిన కుబేర కథేంటీ? అసలేమీ తెలియని ఓ బిచ్చగాడు ప్రభుత్వాన్ని ఏవిధంగా ప్రమాదంలో పడేసాడు? ధనిక, మధ్య తరగతి, పేద అనే మూడు ప్రపంచాల మధ్య ఎలాంటి సంఘర్షణ జరిగిందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
ప్రముఖ పారిశ్రామికవేత్త నీరజ్ (జిమ్ సర్ఫ్). ఇతనొక బిగ్గెస్ట్ బిలియనీర్. లక్షల కోట్ల ఖరీదు చేసే ఆయిల్ నిక్షేపాలను తనకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలతో లక్ష కోట్ల డీల్ సెట్ చేసుకుంటాడు. అంత భారీ మొత్తం చేతులు మార్చడానికి మాజీ CBIఆఫీసర్ దీపక్ (నాగార్జున) సహాయం కొరతారు.
దీపక్ స్వతహాగా సిన్సియర్ ఆఫీసర్ అయినప్పటికీ.. అక్రమ కేసుల్లో జైలు పాలవడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో అందుకు అంగీకరిస్తాడు. జైలు నుంచి విడుదలైన దీపక్.. లక్ష కోట్ల బదిలీ కోసం బినామీలుగా నలుగురు బిచ్చగాళ్ళను ఎంపిక చేస్తాడు.
తిరుపతిలో బిక్షం ఎత్తుకుంటున్న దేవా (ధనుష్) అందులో ఒకడు. దేవా పేరుపై బినామీ కథలు ఓపెన్ చేసి పదివేల కోట్లు జమ చేస్తారు. కానీ ఆ తర్వాత దేవా.. వాళ్ల నుంచి తప్పించుకుని పోతాడు. అతని ఎందుకు తప్పించుకున్నాడు? దీపక్ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇందులో సమీర (రష్మిక) పాత్ర ఏమిటి? అసలు ఈ బిచ్చగాడు కథకు 'కుబేర' టైటిల్ ఎందుకు పెట్టారనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ:
తెలుగు సినీ పరిశ్రమలో సెన్సిటీవ్ చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. తన మొదటి సినిమా ఆనంద్ నుండి మొన్నొచ్చిన లవ్ స్టోరీ వరకు.. ఆయన చిత్రాలన్నీ అలానే ఉంటాయి.
కేవలం భావోద్వేగాలపై కథను నడిపించడం, అందులో ఒక సామజిక అంశాన్ని చూపించడం కమ్ముల స్పెషాలిటీ. అలా వచ్చినవే.. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు. ఆయన సినిమాల్లో హీరోయిజం ఉండదు. కథే ఆయన బలం. అందుకే ఆయన సినిమాలకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి దర్శకత్వ మార్క్ తోనే కుబేర ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాతో అతని మార్క్ను ఒక మెట్టు పైనే ఉంచారు కానీ, కిందికి మాత్రం పడెయ్యలేదు. కుబేర.. ఇది ఒక లక్ష కోట్ల స్కామ్ కథ.
ప్రస్తుత సమాజంలో.. కార్పోరేట్ వ్యవస్థలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయి? రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు? బ్లాక్ మనీ ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. ఇందుకోసం దర్శకుడు శేకర్ కమ్ముల చాలా లోతుగా అధ్యయనం చేసిన తీరు కథలో కనిపిస్తుంది. ఇలాంటి సామజిక అంశాలకు.. కమ్ముల తనదైన శైలిలో ఇంటెన్సి ఎమోషన్స్ తో పాటుగా ఇంట్రస్టింగ్ థ్రిల్లింగ్ అంశాలను జోడించాడు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేకి, ట్విస్టులు రాసుకోవడం వల్ల కుబేర సీడ్ ఎడ్జ్ థ్రిల్లర్ గా మారింది.
ఫస్టాఫ్ అంతా.. కథలో భాగంగా పాత్రల పరిచయం, ఒక్కో పాత్రకి, ఒక్కో సందర్భం. ఏం జరగుతుందా అన్న ఇంటెన్సితో చూసేలా ఉంది. బిచ్చగాడితో కోటీశ్వరుడు ప్రయాణం, ఆ తర్వాత బిచ్చగాడు చావు నుంచి తప్పించుకోవడం వంటి సీన్లతో ఎంగేజింగ్గా సినిమా సాగుతుంది. దేవాని పట్టుకుంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగే ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది.
సెకండాఫ్ విషయానికి వస్తే.. దేవా తప్పించుకుపోయిన తర్వత కథలో మరింత వేగం పుంజుకుంటుంది. చివరికి బిజినెస్ మెన్ నీరవ్ మిత్రా బిచ్చగాడిలా మారడం.. అధికార బలం ఉన్నా బిచ్చగాడిని పట్టుకోలేకపోవడం వంటి సీన్లతో ఎంతో ఎంగేజింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది.
ఓవరాల్ గా డబ్బు, పవర్ మాత్రమే దేశాన్ని నడుపుతున్నాయి. ఇక్కడ నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వీటికి చోటే లేదు.. అంటూ సగటు పౌరుడిలోని ఓ ఆవేదనకి కుబేర మూవీ అద్దం పట్టేలా సాగడం ఆసక్తి పెంచుతోంది. క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది.
ఎవరెలా నటించారంటే:
అసలేమీ ఆశించని బిచ్చగాడి పాత్రలో ధనుష్ ఒదిగిపోయి నటించాడు. తన అసాధారణ నటనతో జాతీయ అవార్డు స్థాయిలో పెర్ఫార్మన్స్ అందించాడు. ఇలాంటి పాత్రల్లో నటించాలంటే ధనుష్కే సాధ్యం. మధ్య తరగతి ధనికుడిగా నాగార్జున తనలోని కొత్త కోణం చూపించాడు. సమీర క్యారెక్టర్ లో రష్మిక మందన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వ్యాపారవేత్తగా నీరజ్ సైతం తన నటనతో మెప్పించాడు. మిగతా పాత్రల్లో నటించిన వారు కుబేర సినిమాకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు:
పేద, గొప్ప కథను ఎవరు చెప్పినా అందులో పేదవాడు గెలవాలని, సమానత్వం ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ దాన్ని ఎలా చెప్పామనేది ముఖ్యం. అదే శేఖర్ కమ్ముల. వాస్తవికతకు దగ్గరగా ఉంటూనే ఓ థ్రిల్లింగ్ పాయింట్తో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమాకు మరో ముఖ్యమైన హీరో దేవీశ్రీ ప్రసాద్. తన బీజీఎమ్, సాంగ్స్ అన్నింట్లో సక్సెస్ అయ్యాడు. చాలా చోట్ల తన సంగీతమే సినిమా స్థాయిని పెంచేసింది. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాను నిలబెట్టడంలో తోడ్పడ్డాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. పెట్టిన ప్రతిపైసాకు న్యాయం జరిగింది.