డబ్బులు తీసుకొని.. కేసీఆర్ ఫ్యామిలీ ని అరెస్ట్ చేయట్లే : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

డబ్బులు తీసుకొని.. కేసీఆర్ ఫ్యామిలీ ని అరెస్ట్ చేయట్లే : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
  •     నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అరవింద్

గజ్వేల్, వెలుగు:  సీఎం రేవంత్​రెడ్డి కేసీఆర్​ కంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నాడని, కేసీఆర్​ ఫ్యామిలీ నుంచి డబ్బు సంచులు తీసుకుని వారిని రక్షిస్తున్నాడని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అరవింద్​ ఆరోపించారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్- ప్రజ్ఞాపూర్​ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోదీ 5 కోట్ల ఇండ్లు కట్టించి  ఇచ్చిండని, కానీ గజ్వేల్​లో కేసీఆర్​ పదేండ్లు సీఎంగా ఉండి ఒక్క ఇల్లు పేదలకు ఇవ్వలేకపోయాడన్నారు. దేశం కోసం పని చేసే బీజేపీని గల్లీ ఎలక్షన్లల్లో కూడా గెలిపించాలని పిలుపునిచ్చారు. సర్పంచ్​ ఎలక్షన్లు పెడితేనే సెంట్రల్​ ఫండ్స్​ ఇస్తానని మోదీ అంటేనే రేవంత్​రెడ్డి ఎన్నికలు పెట్టిండన్నారు.

మతాలతో సంబంధం లేకుండా అందరికీ అభివృద్ది, సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని తెలిపారు. గజ్వేల్​లో శివాజీ విగ్రహానికి ఏంజరిగిందో? హైదరాబాద్​లో గుడులపై ఏంజరుగుతుందో అందరికీ తెలుసని చెప్పారు. రేవంత్ రెడ్డి అండ చూసుకునే హిందువులపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. గజ్వేల్​లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో రేవంత్​రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్​ చేశారు. హరీశ్​రావు తనతో పాటు అందరి ఫోన్లు విన్నాడని విమర్శించారు. కేసీఆర్  కుటుంబం మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు పెట్టి రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. రేవంత్ రెడ్డి సంచుల మోసిన కేసు కూడా ఉందని, దాని మీద కూడా సీబీఐ ఎంక్వైరీ చేయించాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిని కోరారు. ఫోన్​ ట్యాపింగ్, కారు రేసింగ్​ కేసు, అవినీతి ఇలా అన్ని కేసుల్లో రేవంత్​ ఎందుకు చర్య తీసుకుంటలేడని ప్రశ్నించారు.