జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూం తాళాలు పోయాయి.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూం తాళాలు పోయాయి.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

2018లో జరిగిన ధర్మపురి ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా తాళాలు లేవంటూ స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఒక స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశామని కలెక్టర్ చెబుతున్న దాంట్లో.. కోర్టు కోరిన డాక్యుమెంట్స్ లేవన్నారు లక్ష్మణ్. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారాయన. ఈ వ్యవహరంపై కోర్టుకు కూడా వెళ్లతామన్నారు. ఇది నిర్లక్ష్యమా, ఉద్ధేశ్యపూర్వకంగా జరిగిందా తేటతెల్లం కావాలి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

జగిత్యాల జిల్లా ఈవీఎంల స్ట్రాంగ్ రూంకు సంబంధించిన తాళం చేతులు మిస్సయినట్టుగా తెలుస్తోంది. అత్యంత భద్రంగా కాపాడాల్సిన తాళాలు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హై కోర్టను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 17ఏ, 17సి డాక్యూమెంట్లను స్కాన్ చేసి హై కోర్టుకు సమర్పించాల్సి ఉంది.

సోమవారం స్ట్రాంగ్ రూంలో వీటిని బయటకు తీసేందుకు జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి సమాయత్తం కాగా ఎలక్షన్ పిటిషన్ ఉన్న స్ట్రాంగ్ రూంకు సంబంధించిన తాళం చేతులే లేకపోవడంపై అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పై ప్రభుత్వం, మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్ కుమార్.

రెండు తాళం చేతుల జతలు ఉండాలని, జిల్లా అడిషనల్ కలెక్టర్ కంట్రోల్ లో ఉండాల్సిన తాళం చేతులు మాయం కావడం సంచలనంగా మారింది. అసలు ఈ తాళం చేతులు ఎలా పోయాయన్నదే అంతుచిక్కకుండా పోయింది. కలెక్టరేట్ యంత్రాంగం ఆదివారం నుండే అన్వేషించినా ఫలితం లేకుండా పోవడంతో ఈ రోజు స్ట్రాంగ్ రూం తాళాలను పగలగొట్టాలని అధికారులు భావించారు.

అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ తాళం చేతులు మిస్సయిన విషయాన్ని హై కోర్టు దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకున్న తరువాత తాళాలు పగలగొట్టాలని అంటున్నారు. దీంతో జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది.

కలెక్టర్ యాస్మిన్ బాషా

జగిత్యాల స్ట్రాంగ్ రూమ్ తాళాలు దొరకలేదని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు. మూడు స్ట్రాంగ్ రూమ్ ల్లో ఒక గది తాళం తీశామని చెప్పారు. మిగితా రెండు గదుల తాళాలు దొరకలేదన్నారు. తెరిచిన గదిలో కావాల్సిన పత్రాలు లేవని..ఇదే విషయాన్ని కోర్టు కి చెప్తామన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం నడుస్తామని కలెక్టర్ వెల్లడించారు.