జగిత్యాల, వెలుగు: ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే వెనుకంజ వేసిన తల్లిదండ్రులే.. ఇప్పుడు ఆ స్కూల్లో సీటు కోసం ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల రూరల్ మండలం ధర్మారం గ్రామంలోని యూపీఎస్లో సీటుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టీచర్ల ప్రత్యేక శ్రద్ధ, గ్రామస్తుల సహకారం, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ఈ స్కూల్ విద్యార్థులు నవోదయ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో వరుస విజయాలు సాధిస్తున్నారు. ఆరేళ్లుగా టీచర్లు ఫోకస్ పెట్టి, ప్రత్యేక తరగతులు పెట్టి ఫ్రీ కోచింగ్ ఇస్తుండడంతో ఈ స్కూల్ విద్యార్థులు నవోదయకు ఎంపికవుతున్నారు.
ఈ ఏడాది ఇద్దరు ఎంపిక కాగా ఇప్పటివరకు 30 విద్యార్థులు సీటు సాధించారు. టీచర్లే ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ రూపొందించి నామమాత్రపు ఫీజుతో అందిస్తున్నారు. స్కూల్లో 171 మంది విద్యార్థులు ఉండగా 9 మంది టీచర్లు సేవలందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. దీంతో ఈ స్కూల్లో అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టీచర్లు, పేరెంట్లు, విద్యా వాలంటీర్ల సహకారంతోనే మంచి ఫలితాలు వస్తున్నాయని హెచ్ఎం గాజర్ల రమేశ్ చెబుతున్నారు.
