ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు.. బ్లాస్టింగ్‌‌‌‌ ముప్పు..ప్రాజెక్ట్‌‌‌‌ను ఆనుకొని ఉన్న గుట్టకు మరో వైపున క్వారీ పర్మిషన్‌‌‌‌

ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు.. బ్లాస్టింగ్‌‌‌‌ ముప్పు..ప్రాజెక్ట్‌‌‌‌ను ఆనుకొని ఉన్న గుట్టకు మరో వైపున క్వారీ పర్మిషన్‌‌‌‌
  • ఇష్టారీతిన బ్లాస్టింగ్‌‌‌‌ చేస్తుండడంతో ప్రకంపనల బారిన రిజర్వాయర్‌‌‌‌ కట్ట
  • దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌లో ఈ రిజర్వాయరే అత్యంత కీలకం
  • ఇక్కడి నుంచే 1.5 లక్షల ఎకరాలకు సాగు నీరు.. గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌కు తాగునీరు
  • ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆఫీసర్లు

హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు : దేవాదుల ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ డేంజర్‌‌‌‌లో పడింది. రిజర్వాయర్‌‌‌‌ను ఆనుకుని ఉన్న గుట్టకు కంకర క్వారీ ఏర్పాటుకు ఆఫీసర్లు పర్మిషన్‌‌‌‌ ఇవ్వడంతో క్వారీ నిర్వాహకులు ఇష్టారీతిన బ్లాస్టింగ్స్‌‌‌‌ చేస్తున్నారు. భారీ స్థాయిలో పేలుళ్ల కారణంగా రిజర్వాయర్‌‌‌‌ కట్టలు ప్రకంపనలకు గురవుతున్నాయి. దీంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు, గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌కు తాగునీరు అందించే ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ భవిష్యత్‌‌‌‌ ప్రమాదంలో పడింది. మరో వైపు బ్లాస్టింగ్స్‌‌‌‌ కారణంగా స్థానికులు సైతం ప్రమాదాల బారిన పడుతున్నారు. 

ఇక్కడి నుంచే లక్షలాది ఎకరాలకు సాగు నీరు.. గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌కు తాగునీరు

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై కట్టిన జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌‌‌‌ నుంచి స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, హుస్నాబాద్, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాలతో పాటు పలు ఇతర నియోజకవర్గాల పరిధిలో సుమారు 1.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందుతున్నాయి.

అలాగే ఈ రిజర్వాయర్‌‌‌‌ నుంచి గండిరామారం, బొమ్మకూరు, కన్నబోయినగూడెం, వెల్దండ, లద్దనూరు, తపాస్‌‌‌‌పల్లి, ఐనాపూర్‌‌‌‌ రిజర్వాయర్లకు నీటిని లిఫ్ట్‌‌‌‌ చేస్తున్నారు. ఆయా రిజర్వాయర్ల పరిధిలో మరో 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటితో పాటు గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ పరిధిలోని 66 డివిజన్లకు సైతం ఈ రిజర్వాయర్‌‌‌‌ నుంచే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అంతటి ప్రాధాన్యం కలిగిన ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ పక్కనే బ్లాస్టింగ్స్‌‌‌‌ జరుగుతుండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పేలుళ్లతోనే టన్నెల్‌‌‌‌ లీక్‌‌‌‌ ?

దేవాదుల థర్డ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ పనుల్లో భాగంగా దేవన్నపేట పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ నుంచి ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ వరకు పైప్‌‌‌‌లైన్‌‌‌‌ వేశారు. కానీ ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ సమీపంలో సుమారు 208 మీటర్ల మేర గుట్ట రాయి ఉండగా.. అప్పట్లో ఆ రాయిని తొలిచి టన్నెల్‌‌‌‌ నిర్మించారు. ఇటీవల ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ నిర్వహించగా టన్నెల్‌‌‌‌ లీక్‌‌‌‌ కావడంతో మూడు నెలల నుంచి రిపేర్లు కొనసాగుతున్నాయి.

టన్నెల్‌‌‌‌ లోపల మళ్లీ పైప్‌‌‌‌లైన్‌‌‌‌ వేసి కేసింగ్‌‌‌‌ చేస్తున్నారు. అయితే టన్నెల్‌‌‌‌ లీక్‌‌‌‌ కావడానికి చుట్టుపక్క ప్రాంతాల్లో గతంలో జరిగిన బ్లాస్టింగ్సే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ధర్మసాగర్ రిజర్వాయర్‌‌‌‌ను ఆనుకునే పేలుళ్లు జరుగుతుండడంతో రిజర్వాయర్‌‌‌‌ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పట్టించుకోని ఆఫీసర్లు

ధర్మసాగర్‌‌‌‌ మండలంలో మైనింగ్‌‌‌‌ దందా జోరుగా సాగుతోంది. నిర్వాహకులు ఇష్టారీతిన బ్లాస్టింగ్స్‌‌‌‌ చేస్తుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గాయాలపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు, స్థానికులు పలుమార్లు ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. అయినా ఆఫీసర్లు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పుడే హడావుడి చేసి వదిలేయడం తప్ప, ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అంటున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ను కాపాడడంతో పాటు, బ్లాస్టింగ్స్‌‌‌‌ చేస్తున్న క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా పర్మిషన్లు

ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌ను ఆనుకొని ఉన్న మేరీమాత గుట్టకు వెనుకవైపున కొంతకాలంగా కంకర క్వారీ నడుస్తోంది. వాస్తవానికి రిజర్వాయర్‌‌‌‌కు ఆనుకొని ఎలాంటి మైనింగ్‌‌‌‌కు పర్మిషన్‌‌‌‌ ఇవ్వకూడదనే రూల్‌‌‌‌ ఉన్నా.. ఆఫీసర్లు ఇష్టారీతిన అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో క్వారీ యాజమానులు జిలెటిన్‌‌‌‌ స్టిక్స్‌‌‌‌తో పాటు ఇతర పేలుడు పదార్థాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. బుధవారం సాయంత్రం కూడా ఇలాగే బ్లాస్టింగ్స్‌‌‌‌ జరగడంతో ఏడాదిన్నర బాబుతో పాటు మరో యువకుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

ఓ కోళ్లఫామ్‌‌‌‌ నిర్వాహకుడికి రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ఈ క్వారీ ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు 200 మీటర్ల దూరంలోనే ఉంది. బ్లాస్టింగ్స్‌‌‌‌ కారణంగా రిజర్వాయర్‌‌‌‌ కట్టతో పాటు చెరువుకు అవతలి వైపు ఉన్న గేటెడ్‌‌‌‌ స్పిల్‌‌‌‌వే సైతం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా ధర్మసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌కు వెనుక వైపు గతంలో ఓ ప్రైవేట్‌‌‌‌ సంస్థ ప్రభుత్వ అనుమతులతో గుట్టను తవ్వి రాళ్లను ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ నిర్మాణానికి తరలించగా.. ఆ క్వారీలో ఇప్పుడు కూడా బ్లాస్టింగ్స్‌‌‌‌ జరుగుతుండడం గమనార్హం.