బెంగళూరు: సౌతాఫ్రికా–ఎతో గురువారం ప్రారంభమైన రెండో అనధికార టెస్ట్లో ఇండియా టాప్ ఆర్డర్ ఫెయిలైంది. ధ్రువ్ జురెల్ (132 నాటౌట్) సెంచరీతో చెలరేగినా.. మిగతా బ్యాటర్లు నిరాశపర్చడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా–ఎ తొలి ఇన్నింగ్స్లో 77.1 ఓవర్లలో 255 రన్స్కు ఆలౌటైంది. ఆరంభం నుంచి సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
టియాన్ వాన్ వురెన్ (4/52), షెపో మోరెకి (2/52), ప్రేనేలన్ సుబ్రాయెన్ (2/73) వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇండియా స్కోరు బోర్డును అడ్డుకున్నారు. దాంతో ఓపెనర్లు కేఎల్ రాహుల్ (19), అభిమన్యు ఈశ్వరన్ (0), సాయి సుదర్శన్ (17), దేవదత్ పడిక్కల్ (5), కెప్టెన్ రిషబ్ పంత్ (24) నిరాశపర్చారు. 86/5తో కష్టాల్లో పడిన ఇండియా ఇన్నింగ్స్ను జురెల్ సెంచరీతో నిలబెట్టాడు.
కానీ రెండో ఎండ్లో అతనికి సరైన సహకారం దక్కలేదు. హర్ష్ దూబే (14), ఆకాశ్ దీప్ (0) ఫెయిలయ్యారు. ఈ దశలో కుల్దీప్ యాదవ్ (20) మెల్లగా ఆడి ఎనిమిదో వికెట్కు 79 రన్స్ జోడించడంతో ఇన్నింగ్స్ కాస్త కోలుకుంది. కానీ కుల్దీప్ ఔటైన తర్వాత సిరాజ్ (15), ప్రసిధ్ కృష్ణ (0) వెంటవెంటనే వెనుదిరగడంతో ఇండియా ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
