
- వచ్చే నాలుగు రోజులు గాలిదుమారాలే
- 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే చాన్స్
- ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- టెంపరేచర్లు 40 డిగ్రీలకు దిగివస్తాయని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు పొద్దున ఎండలు దంచి కొడుతున్నా.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతున్నది. గాలి దుమారంతోపాటు వర్షాలు కురుస్తున్నాయి. సుడిగాలులు భయపెట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల వడగండ్లూ పడుతున్నాయి. శుక్రవారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరితోపాటు పలు జిల్లాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఆ ఈదురుగాలుల ధాటికి స్వర్ణగిరిలో భవనాల అద్దాలు పగిలిపోయాయంటేనే గాలి తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే, మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన వేగంతో గాలిదుమారాలు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది. పలు జిల్లాలకు ఈదురుగాలుల వర్షాలపై ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆదివారం, సోమవారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మంగళ, బుధవారా ల్లో ఆయా జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకూ ఆరెంజ్ అలర్ట్ను ఇష్యూ చేసింది.
ఆయా జిల్లాల్లో ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని హెచ్చరించింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసిన ఐఎండీ.. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొన్నది. హైదరాబాద్ నగరంలోనూ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించింది.
నిరుడుతో పోలిస్తే ఎండలు తక్కువే
ఎండలు తీవ్రంగానే ఉంటున్నా.. నిరుడు ఇదే టైంతో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిరుడు ఇదే తేదీన గరిష్ట ఉష్ణోగ్రత లు 46 డిగ్రీల మార్క్ను దాటేశాయి. నిరుడు ఇదే డేట్రోజున 11 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డు కాగా.. అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 9 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే రికార్డయ్యాయి.
కానీ, ఈ ఏడాది మే 3న రికార్డయిన అత్యధిక టెంపరేచర్ 43.9 డిగ్రీలు. 6 జిల్లాల్లో 43 డిగ్రీల కుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.5 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా నమోదుకాగా.. మిగతా జిల్లాల్లో 40 నుంచి 41.9 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. రాబోయే 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 40 డిగ్రీలకు దిగి వస్తాయని పేర్కొన్నది. కాగా, హైదరాబాద్ సిటీలో శనివారం పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది.