
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల డిజిటల్ చెల్లింపుల స్వీకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయ్యింది. ఇప్పటివరకు ఈ చెల్లింపులను బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు స్వీకరిస్తుండగా, స్వీకరించిన మొత్తాన్ని కొందరు ఖజానాలో జమ చేయకుండా నెల చివరి రోజు చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అవకతవకలను అరికట్టేందుకు డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం అర్హత కలిగిన ఏజెన్సీల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) బిడ్లను ఈ నెల 16వ తేదీలోపు సమర్పించాలని జీహెచ్ఎంసీ నోటిఫికేషన్జారీ చేసింది.
చెల్లింపుల స్వీకరణకు వాట్సాప్ బిజినెస్ ప్లాట్ఫామ్ను ఉపయోగించే సంస్థలు మెటా టెక్ పార్ట్నర్గా గుర్తింపు పొంది ఉండాలని పేర్కొంది. బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు స్వీకరించిన అనుభవం కలిగి ఉండాలని నిబంధన విధించింది. అంతేకాకుండా 24 గంటలూ చెల్లింపులను స్వీకరించి, డ్యాష్బోర్డుపై పురోగతిని ప్రదర్శించే సామర్థ్యం ఉన్న సంస్థలు బిడ్లు సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.