
నిజామాబాద్: ఈ భూమిపై గాలి ఉన్నన్ని రోజులు.. బాలు గొంతు ఉంటుందని, ఆయన అమరుడని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఆదివారం నిజామాబాద్ లోని నర్సింగ్ పల్లి ఇందూరు తిరుమల క్షేత్రం లో ఎస్పీ బాలు సంతాప సభ జరిగింది. పాటల నిధికి అశ్రు నివాళి పేరుతో జరిగిన ఈ సంతాప సభలో నిర్మాత దిల్ రాజు, ఇతర గాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. “16 భాషల్లో 40వేల పాటలు పాడిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు ప్రతీ ఇంట్లో, బడిలో, గుడిలో ఓ భాగమై ఉన్నారు. పాడుతా తీయగా, స్వరాభిషేకం లో వారు పిల్లలకు కేవలం స్వరాలే నేర్పకుండా సంస్కారం కూడా నేర్పారు. దిల్ సినిమా నుంచి శతమానం భవతి సినిమా వరకు బాలుతో కలిసి పనిచేశాం. బాలుతో పాటల రికార్డింగ్ అంటే అదనపు ఆకర్షణ, ఆ పాటకే అందం వచ్చేదని” అన్నారు.