
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ, పేదల కోసం చేసిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర 2 (Yatra 2) మూవీ తెరకెక్కుతోంది. డైరెక్టర్ మహి వి రాఘవ్(Mahi V Raghav) తెరెకక్కిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు ఇంకో రెండ్రోజులు మాత్రమే టైం ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇవాళ మంగళవారం (ఫిబ్రవరి 6న) ‘యాత్ర 2’ మేకర్స్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ మహి వీ రాఘవ్..మాట్లాడుతూ..
వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాంతరం..జగన్ పాదయాత్ర వంటి అంశాలు..జరిగిన విషయాలు అందరికీ తెలిసినవే. కానీ, యాత్ర 2 సినిమాను ఎలా తీశామన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ యాత్ర 2 సినిమాను ఎలా తీశాం, ఏ ఎమోషన్తో ముందుకు నడిపించామన్నది ఏ ఒక్కరికీ తెలియదు. ముందుగా రిలీజైన టీజర్, ట్రైలర్లో చూసిన చాలా సీన్లు ప్రజలకి తెలిసి ఉండకపోవచ్చు.
ముఖ్యంగా ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్ ఇవన్నీ బయటి ప్రజలకు ఈ మాత్రం తెలిసినవి కావు. ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని సినిమాని చాలా ఎమోషన్గా తీశాను. ట్రైలర్లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే..ఆ సీన్తో ఎమోషన్ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నదే సినిమా ప్రధాన ఉద్దేశం.
వైఎస్ రాజశేఖర్రెడ్డి పేదల కోసం, వికలాంగుల కోసం, ప్రతి ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పే ఉద్దేశంలో ఆ సీన్ అనుకోవచ్చు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది ఆయన వెనకాల నిలిచారు అనేది చెప్పడం కోసం ఆ అంధుడి పాత్రని సినిమాలో చూపించాం అని డైరెక్టర్ మహి తెలిపారు.
యాత్ర 2 సినిమా రిలీజ్ ఒక్క రోజు ముందుగానే..పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ కాబోతుందని మీడియా అడగగా..మహి రిప్లై ఇస్తూ..ప్రస్తుతం ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, రీ రిలీజ్ చేసినా పర్వాలేదు..ఎప్పుడైనా అన్నీ సినిమాలు బాగా ఆడాలి..ఆ డబ్బులన్నీ మన ఇండస్ట్రీకే కదా వస్తాయి. అన్ని సినిమాలకు కలెక్షన్స్ వస్తే..థియేటర్ యాజమానులు బాగుంటారు కదా..అని తెలిపారు.
ఇక ప్రతీ రాజకీయ నాయకుడి మీద కేసులుంటాయి. కానీ ఈ మూవీలో ఒకర్ని ఎక్కువ చూపించడం..ఇంకొకరిని తక్కువ చేసి చూపించడం అనేది చేయలేదు. సినిమా చూశాకా నమ్మేలా ఉందా? పూర్తిగా భజనలా అనిపించిందా? అన్నది ఆడియెన్స్కి అర్థం అవుతుంది. సినిమాలంటే..నిజాలైనా చూపించాలి..నమ్మేలా అయినా చూపించాలి. ఇందులో నిజాలెంత? కల్పితం ఎంత అని మీడియా ప్రశ్నించగా..అన్నంలో నీళ్లలా 1:2 శాతం అని చెప్పలేం అని డైరెక్టర్ మహి వి రాఘవ్ వెల్లడించారు.