దివాలా తీసిన డిస్కంలు

దివాలా తీసిన డిస్కంలు
  • డిస్కంలు దివాలా
  • రూ. 50 వేల కోట్ల నష్టాలు.. రూ. 24 వేల కోట్ల అప్పులు
  • బిల్లులు చెల్లించని రాష్ట్ర సర్కారు.. రూ. 15 వేల కోట్ల దాకా పెండింగ్​
  • ఏటేటా పెరుగుతున్న మిత్తీల భారం
  • అప్పులు తెస్తే కానీ జీతాలు ఎల్లని పరిస్థితి

రాష్ట్రంలోని విద్యుత్​ పంపిణీ సంస్థలు పాతాళం లోతు నష్టాల్లో కూరుకుపోయాయి. నెలనెలా అప్పులు తెచ్చి ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రాక, వివిధ శాఖల్లో బిల్లులు పేరుకుపోవడంతో డిస్కంలు తిప్పలు పడుతున్నాయి . రాష్ట్ర సర్కారు నుంచి దాదాపు రూ. 15 వేల కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఇటు ఆదుకునే దిక్కు లేక, అటు ఇష్టమొచ్చినట్లు విద్యుత్​ కొనుగోళ్లు చేయటం, నిర్వహణ లోపం, లెక్కలేనన్ని అప్పులు.. డిస్కంలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఇట్లనే కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి పరిస్థితి ఏర్పడనుంది.

హైదరాబాద్​, వెలుగు: డిస్కంలు దివాలా తీస్తున్నాయి. ఓవైపు నష్టాలు, మరో వైపు అప్పులతో సతమతమవుతున్నాయి. నార్తర్న్​  డిస్కం (ఎన్​పీడీసీఎల్), సదరన్​​డిస్కం (ఎస్​పీడీసీఎల్)​ రెండింటి నష్టాలు కలిపి గత ఏడాది మార్చి నాటికే రూ. 42 వేల కోట్లు దాటి పోయాయి. విద్యుత్​ సంస్థలు అధికారికంగా విడుదల చేసిన 2019–20 వార్షిక రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే... డిస్కంల నష్టాలు ప్రస్తుతానికి రూ. 50 వేల కోట్లకు చేరువయ్యాయి. కొత్త రాష్ట్రంలో విద్యుత్​ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, నిర్విరామంగా వ్యవసాయానికి ఫ్రీ కరెంట్​ అందిస్తున్నట్లు చెప్పుకుంటున్న  రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలను నట్టేటా ముంచుతోంది. విద్యుత్​ పంపిణీ  వ్యయంతో పోలిస్తే బిల్లులు, ప్రభుత్వ సబ్సిడీల ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉండటమే నష్టాలకు కారణమని డిస్కంలు తమ నివేదికల్లో ప్రస్తావించాయి. 

నష్టాల మీద నష్టాలు
డిస్కంలు కొంటున్న విద్యుత్​ ఖర్చులు.. బిల్లుల ద్వారా వచ్చే ఆదాయం ఆడికాడికి సరిపోతున్నాయి. తెచ్చిన  అప్పులకు కిస్తులు కట్టేందుకు, నిర్వహణ ఖర్చులకు, ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు నెలనెలా కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. 2019‌‌‌‌–20 ఏడాదిలో సదరన్​ డిస్కం రూ. 4,946 కోట్లు నష్టపోగా, నార్తర్న్​ డిస్కం రూ. 1,116 కోట్లు నష్టపోయింది. మొత్తంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నిరుడు మార్చి వరకు ఎస్​పీడీసీఎల్​ రూ. 29,309  కోట్లు, ఎన్​పీడీసీఎల్​ రూ. 12,983 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 

కాళేశ్వరం కరెంటు బిల్లు 1600 కోట్లు పెండింగ్​
ఇరిగేషన్​ ప్రాజెక్టులకు పెరిగిన విద్యుత్​ వాడకం డిస్కంల పాలిట శాపంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ల ఎత్తిపోతలకు మూడేండ్లలో రూ. 2,400 కోట్ల కరెంట్‌‌ బిల్లు అయింది. మేడిగడ్డ నుంచి మూడు స్టేజీల్లో ఎల్లంపల్లికి, అక్కడి నుంచి రెండు స్టేజీల్లో మిడ్‌‌ మానేరుకు, అక్కడి నుంచి ఐదు స్టేజీల్లో కొండపోచమ్మసాగర్‌‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. భారీ మోటార్లతో లిఫ్టింగ్​కు నిరుటి వరకు రూ. 2,090 కోట్లు ఖర్చు కాగా, ఈ  వానాకాలంలో ఎత్తిపోసిన నీళ్లకు ఇంకో రూ. 300 కోట్ల వరకు కరెంట్‌‌ బిల్లు వచ్చింది. మొత్తంగా రూ. 2,400 కోట్ల కరెంట్​ బిల్లుల్లో ఇప్పటి వరకు దాదాపు రూ. 800 కోట్లు చెల్లించిన ఇరిగేషన్​ విభాగం మిగతా రూ. 1,600 కోట్లను పెండింగ్​లో పెట్టింది. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖలు, ఆఫీసుల నుంచి డిస్కంలకు రావాల్సిన కరెంట్​  బిల్లులు సుమారు రూ. 11 వేల కోట్ల దాకా పెండింగ్​లో ఉన్నాయి. 2019‌‌‌‌‌‌‌‌–20 ఏడాదంతా రాష్ట్రంలో విద్యుత్​ అవసరాలకు  రూ. 35 వేల కోట్ల పవర్​ పర్చేజ్​ చేసిన  డిస్కంలు బిల్లుల ద్వారా  రూ. 37 వేల కోట్లు రాబట్టుకున్నాయి. కానీ జీతాలకు రూ. 3,700 కోట్లు, అప్పుల కిస్తీలు, నిర్వహణ ఖర్చుల పేరిట భారీ నష్టాలు చూపించాయి. 

మిత్తీలకే తడిసి మోపెడు
డిస్కంలు ఇప్పటి దాకా చేసిన అప్పులను తీర్చేందుకు నానా తిప్పలు పడుతున్నాయి. హైదరాబాద్​ కేంద్రంగా ఉన్న ఎస్​పీడీసీఎల్ కు రూ. 14,167 కోట్ల అప్పులున్నాయి. వరంగల్​లో ఉన్న ఎన్​పీడీసీఎల్​కు రూ. 9,701 కోట్ల అప్పులున్నాయి. మొత్తంగా రెండింటికీ కలిపి దాదాపు రూ. 24 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. రెండు డిస్కంలు తెచ్చిన అప్పులు, వడ్డీలకు కలిపి నిరుడు రూ. 2,115 కోట్లు చెల్లించాయి. ఇవి 2018-19తో పోలిస్తే రూ. 300 కోట్లు పెరిగాయి.  ఏటా పెరుగుతున్న వడ్డీల భారం డిస్కంల నడ్డి విరిస్తోంది. దేశంలోని డిస్కంలను రుణాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్​ స్కీం​ కూడా లాభం లేకుండా పోయింది. ఇందులో భాగంగా డిస్కంల మొత్తం అప్పుల్లో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్​ చేయాలి. ఈ లెక్కన   రూ. 8,909 కోట్లు చెల్లించాల్సిన ప్రభుత్వం.. ఇప్పటికీ  రూ. 1,207 కోట్లు ఇవ్వకుండా పెండింగ్​లో పెట్టింది. 

ట్రాన్స్​మిషన్​ లాస్ లోనూ రికార్డు
విద్యుత్‌‌‌‌ వాడకం రికార్డు స్థాయిలో ఉన్న తెలంగాణలో కోట్ల విలువైన కరెంటు వృథాగా పోతోంది. ఇలా వృథా అయ్యే కరెంట్​ను డిస్కంలు వ్యవసాయ పంపుసెట్ల మీద తోస్తున్నాయి. నార్తర్న్ డిస్కంలో 2019లో 26.66% ఉన్న సరఫరా నష్టాలు  2020లో  34.49 శాతానికి పెరిగాయి. సదరన్​ డిస్కంలో15.41% ట్రాన్స్​మిషన్​ లాస్​ నమోదైంది. విద్యుత్‌‌‌‌ లైన్లు, సబ్‌‌‌‌స్టేషన్ల నిర్వహణ, పరికరాల నాణ్యత లోపంతోనే పంపిణీ నష్టాలు  జరుగుతున్నాయి.

రేటింగ్​లో అట్టడుగున
విద్యుత్‌‌‌‌ పంపిణీలో మనమే నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటల డొల్లతనాన్ని కేంద్ర ఇంధన శాఖ బయటపెట్టింది. ఇంధన శాఖ ప్రకటించిన 9వ యానివల్​ ఇంటిగ్రేటెట్​ రేటింగ్​లో తెలంగాణకు చెందిన 2 విద్యుత్​ పంపిణీ సంస్థలు కనుచూపు మేరలో లేవు. దేశంలోని 41 విద్యుత్​ పంపిణీ సంస్థల్లో  హైదరాబాద్​లోని ఎస్​పీడీసీఎల్​కు  23వ స్థానం,  వరంగల్​లోని ​ఎన్​పీడీసీఎల్​కు  33వ స్థానం దక్కాయి. పంపిణీ నష్టాలు, ఎక్కువ ధర పెట్టి విద్యుత్​  కొనుగోలు చేయటం డిస్కంల రేటింగ్​ను బీ, సీ కి కేంద్రం పరిమితం చేసింది.