బిజినెస్ డెస్క్, వెలుగు: కొత్త సంవత్సరం మొదటి నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలు జొమాటో, స్విగ్గీల డిస్కౌంట్ ఆఫర్లపై ఇన్కంటాక్స్ నిఘా పెరగనుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) కింద ఈ స్క్రూటినీ జరగనుంది. ఎంపిక చేసిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, డిజిటల్ వాలెట్లపై ఈ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ఆఫర్ చేస్తున్న కూపన్ డిస్కౌంట్లు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వాటిని లోతుగా పరిశీలించాలనేది ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ ఆలోచనగా ఎకనమిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. డిస్కౌంట్లు ఇవ్వడానికి రెస్టారెంట్లు, ఫుడ్ ప్లాట్ఫామ్స్ మధ్య అరేంజ్మెంట్లపైనా ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టనుంది. జనవరి 1, 2022 నుంచి జొమాటో, స్విగ్గీలను రెస్టారెంట్లతో సమానంగా ట్రీట్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ ప్లాట్ఫామ్స్ డెలివరీ చేసే ఫుడ్ విలువ మొత్తంపై 5 శాతం జీఎస్టీని అమలు చేయనున్నారు.
ప్రోబ్లమ్ ఏమిటి ....
ఫుడ్ ప్లాట్ఫామ్స్పై ఆర్డరు ఇచ్చేటప్పుడు కొన్ని ఎంపిక చేసిన పేమెంట్ పద్ధతులకు ప్రత్యేక ఆఫర్లు, మినహాయింపులను ఇస్తున్నారు. ఈ కంపెనీలు నిజానికి ఈ–కామర్స్ ఆపరేటర్ల తరహాలోనే పనిచేస్తున్నట్లు. మనం నేరుగా రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మనకి నచ్చిన విధంగా పేమెంట్ జరుపుతుంటాం. కానీ, కస్టమర్ యూసేజ్ని బట్టి ఆయా కార్డులు, పేమెంట్ వాలెట్లపై ఫుడ్ ప్లాట్ఫామ్స్ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. కొంత మొత్తానికి మించి ఇచ్చే ఆర్డర్లపైనా, కొన్ని రెస్టారెంట్లకు ఇచ్చే ఆర్డర్లపైనా కూడా అదనపు డిస్కౌంట్లను చెల్లిస్తున్నాయి. ఫుడ్ డెలివరీ యాప్స్పై అమలులోకి తెచ్చే 5 % జీఎస్టీని ఏ అమౌంట్పై విధించాలనేది ఇప్పుడు కొత్త ప్రశ్న. ఫుడ్ అసలు విలువెంతో దాని మీద విధించాలా లేక డిస్కౌంట్ మినహాయించిన రేటు మీదా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఉదాహరణకు, మనకి ఇష్టమైన రూ. 650 విలువ చేసే పిజ్జా కాంబోను ఫుడ్ ప్లాట్ఫామ్పై ఆర్డరు పెట్టామనుకుందాం. ఎంపిక చేసిన పేమెంట్ పద్ధతిలో కనక మనం పేమెంట్ చేస్తే మనకి రూ. 100 డిస్కౌంట్ దొరుకుతుంది. ఇప్పుడు సమస్య ఏమంటే, 5 % జీఎస్టీ దేనిపై విధించాలి..అసలు విలువ రూ. 650 పైనా లేక డిస్కౌంట్ తర్వాత విలువ రూ. 550 పైనా..ఏ విలువపై జీఎస్టీ విధించాలనే అంశంపై స్పష్టత లేదు. డెలివరీ బాయ్స్కి ఇచ్చే టిప్పులు, సర్జ్ ఫీజు, డెలివరీ ఫీజు వంటివి కస్టమర్ భరిస్తున్నాడు. జీఎస్టీ విధానం కింద దీన్ని ఎలా ట్రీట్ చేయాలనేది మరో కొత్త సమస్యగా మారనుంది.