
ముందు అసెంబ్లీలో.. అటు తర్వాత కౌన్సిల్లో..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో, మండలిలో శుక్రవారం కొత్త మునిసిపల్ చట్టానికి సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలుపనున్నారు. గురువారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే ఆబ్కారీ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్.. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ రెండో వార్షిక నివేదికను ప్రవేశపెడుతారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి.. సర్వశిక్ష అభియాన్ ఆడిట్ రిపోర్ట్ను సభలో ప్రవేశపెడతారు. ఈ రిపోర్టులపై స్వల్ప చర్చ తర్వాత సభ ఆమోదం పొందుతారు. ఆ తర్వాత మున్సిపల్ బిల్లుపై ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చర్చను ప్రారంభిస్తారు. దీనిపై చర్చ తర్వాత భోజన విరామ సమయానికి ముందు సభ ఆమోదిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు శాసన మండలి సమావేశమవుతుంది. మున్సిపల్ బిల్లుతో పాటు బెవరేజెస్ కార్పొరేషన్ నివేదిక, సర్వశిక్ష అభియాన్ నివేదిక ఆమోదం పొందడానికి అసెంబ్లీలో ఎక్కువ సమయం తీసుకుంటే అంతదాకా మండలి సమావేశాన్ని వైస్ చైర్మన్ వాయిదా వేస్తారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత సీఎం, మంత్రులు మండలికి చేరుకుంటారు. దీంతో మండలి తిరిగి ప్రారంభం అవుతుంది. తొలుత మున్సిపల్ బిల్లును మండలిలో సీఎం ప్రవేశపెడుతారు. అసెంబ్లీ ఆమోదించిన మిగతా ఐదు బిల్లులను మండలిలో పెట్టి ఆమోదం పొందిన తర్వాత మున్సిపల్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తారు. సాయంత్రం సీఎం సమాధానం తర్వాత మున్సిపల్ బిల్లుకు ఆమోదం పొందుతారు. ఆ తర్వాత మండలి సమావేశాలను కూడా నిరవధికంగా వాయిదా వేస్తారు.