
తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సమస్యలనే కాదు.. వాటి పరిష్కారాలను కూడా తమనే సూచించమని సీఎం రేవంత్ రెడ్డి కోరడం సంతోషంగా ఉందన్నారు దిల్ రాజు. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తరపున సినీ ప్రముఖులు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో చర్చించిన వివరాలతో పాటు సినిమా రిలీజ్ డేట్స్పై తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు మాట్లాడుతూ ‘దాదాపు గంట పదిహేను నిమిషాలు సీఎం గారితో ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు గురించి చర్చించాం.
సమస్యలే కాదు సమస్యల పరిష్కారాలు కూడా మీరే తీసుకువస్తే.. ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలన్నా చేయడానికి రెడీగా ఉన్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. రెండు రోజుల్లో ఈసీ మీటింగ్ పెట్టుకుని దాంట్లో సమస్యలు అన్నిటికి పరిష్కారాలను తీసుకుని మళ్ళీ సీఎం గారిని కలిసి దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. ఇక చాంబర్ కోరగానే సంక్రాంతి బరి నుంచి తప్పుకుని రవితేజ ‘ఈగల్’ చిత్రాన్ని ఫిబ్రవరి 9కి మార్చుకోవడం జరిగింది. కానీ అదే డేట్కి ‘భైరవకోన’ వస్తుండటంతో ఆ చిత్ర నిర్మాతలతో చర్చించాం. దీంతో వారు ఫిబ్రవరి 16కి డేట్ మార్చుకున్నారు.
అయితే పొలిటికల్ రీజన్స్తో ‘యాత్ర2’, తమిళంలోనూ రిలీజ్ ఉండటంతో రజినీకాంత్ ‘లాల్ సలామ్’ మాత్రం రిలీజ్ డేట్ను మార్చలేకపోతున్నామన్నారు. దీనికి ‘ఈగల్’ చిత్ర నిర్మాతలు కూడా ఒప్పుకోవడంతో సామరస్యంగా సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, నిర్మాతలు వివేక్ కూచిబొట్ల, రాజేష్ దండా, వైవీఎస్ చౌదరి పాల్గొన్నారు.