యముడైన బంధువు.. భర్త డ్యూటీకి వెళ్లగానే.. చంపి బాత్రూంలో పడేశాడు

యముడైన బంధువు.. భర్త డ్యూటీకి వెళ్లగానే.. చంపి బాత్రూంలో పడేశాడు
  • బంగారం కోసం మహిళ హత్య
  • ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ
  • అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు

జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ నెల 12న ఓ మహిళ అనుమానస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. మహిళకు తెలిసిన వ్యక్తే హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాలానగర్​ ఏసీపీ సురేశ్​కుమార్​ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బొగ్గుల శివమాధవరెడ్డి(23) నగరంలోని ఎస్ఆర్​ నగర్​లో ఉంటూ ఇంజినీరింగ్​ చదువుతున్నాడు. బెట్టింగ్​కు అలవాటుపడి రూ.7 లక్షలు అప్పు చేశాడు. 

తన గర్ల్​ ఫ్రెండ్​ తల్లి వద్ద ఓ గోల్డ్​ చైన్​ తీసుకుని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తేవడంతో భారీ చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన గ్రామానికి చెందిన దూరపు బంధువు ఎర్రమల్ల నిహారిక(21) జగద్గరిగుట్ట వెంకటేశ్వరనగర్​లో నివాసముంటున్న విషయం తెలిసింది. దీంతో ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె  వద్ద బంగారం ఉందని గమనించాడు. ఈ నెల 12న మధ్యాహ్నం నిహారిక ఇంటికి వెళ్లాడు. ఆమె భర్త డ్యూటీకి వెళ్లడంతో గొంతు నులిమి చంపేశాడు. 

ఆ తరువాత ఆమె బాత్రూంలో చనిపోయినట్లు చిత్రీకరించాడు. బంగారు పుస్తెలతాడు, చెవి రింగులు, మూడు ఉంగరాలు, బెడ్​రూమ్​లో ఉన్న రూ.2,500 ఎత్తుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన నిహారిక  భర్త దేవేందర్​రెడ్డి తన భార్య బాత్​రూమ్​లో స్నానం చేస్తూ మృతిచెందినట్లు భావించాడు. దవాఖానకు తీసుకెళ్లగా డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా శివమాధవరెడ్డి హత్య చేసినట్లు గుర్తించారు. అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు