ఆన్లైన్ షాపింగ్ పెరిగిన కొద్దీ, అదే మోతాదులో ఆన్లైన్ కార్డు మోసాలూ పెరుగుతున్నాయి. ఇటీవలికాలంలో ఇవి మరింత ఎక్కువయ్యాయి. చాలా మంది సైబర్ మోసగాళ్ల బారినపడి నష్టపోతున్నారు.
ఆన్లైన్ షాపింగ్ పెరిగిన కొద్దీ, అదే మోతాదులో ఆన్లైన్ కార్డు మోసాలూ పెరుగుతున్నాయి. ఇటీవలికాలంలో ఇవి మరింత ఎక్కువయ్యాయి. మారుమూల ప్రాంతాలవాళ్లూ కార్డులతో షాపింగ్ చేస్తున్నారు. చాలా మంది సైబర్ మోసగాళ్ల బారినపడి నష్టపోతున్నారు. ఇట్లాంటి ఇబ్బందుల బారిన పడకుండా ఏం చేయాలో తెలుసుకుందాం.
బిజినెస్డెస్క్, వెలుగు: కరోనా టైంలో షాపులన్నీ మూతబడ్డాక మరింత మంది ఆన్లైన్ షాపింగ్కు అలవాటుపడ్డారు. ఇంటికే అన్నీ వస్తుండటం, డిస్కౌంట్లూ ఇవ్వడంతో గ్రామాల జనం కూడా ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. క్రెడిట్/డెబిట్కార్డులతో కొంటే ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు అదనంగా డిస్కౌంట్లు ఇస్తాయి. దీంతో కార్డుల పేమెంట్స్ భారీగా పెరుగుతున్నాయి. అయితే టెక్నికల్ నాలెడ్జ్ లేని కార్డుహోల్డర్లను సైబర్ మోసగాళ్లు దోచుకుంటున్నారు. తాజా రిపోర్టు ప్రకారం ఆన్లైన్ కార్డు ఫ్రాడ్ల విలువ ఈ ఏడాదిలో ఎనిమిది బిలియన్ డాలర్ల (దాదాపు రూ.60 వేల కోట్లు) వరకు ఉంటుంది. 2019లో దాదాపు బిలియన్ డాలర్ల సొమ్ము దోపిడీ అయింది. మనదేశంలో పండగ సీజన్ ఇంకా నడుస్తోంది. ఫెస్టివల్ సేల్స్ కూడా కొనసాగుతున్నాయి. ఆర్డర్ల సంఖ్య ఇంకా పెరుగుతుందని ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు చెబుతున్నాయి. వీరిలో మెజారిటీ కస్టమర్లు కార్డుల ద్వారా డబ్బు చెల్లిస్తారు. కార్డు ఫ్రాడ్స్ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే చిక్కుల్లో పడక తప్పదు. అయితే కార్డులతో డబ్బు చెల్లించడం వల్ల కొన్ని లాభాలూ ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ కంపెనీ పంపిన ప్రొడక్టు నచ్చకుంటే కంప్లైయింట్ ఇవ్వొచ్చు. వస్తువును వాపసు చేస్తే డబ్బు అదే కార్డులోకి తిరిగి క్రెడిట్ అవుతుంది. కార్డు హ్యాక్ అయినా, అనధికారికంగా చార్జీలు వేసినా కార్డుహోల్డర్ల బాధ్యత ఉండదు. వెంటనే కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అలెర్ట్గా ఉండటం మాత్రం తప్పనిసరి.
ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి ?
1.నేరుగా క్రెడిట్/డెబిట్కార్డు నంబరు ఇచ్చే బదులు వర్చువల్ కార్డు నంబరుతో షాపింగ్ చేయాలి. దీనివల్ల మన కార్డు నంబర్లను మర్చంట్లు చూసే అవకాశం ఉండదు. పొరపాటున నకిలీ సైట్లో ఏదైనా ఆర్డర్ ఇచ్చినా, కార్డు వివరాలు దానికి చిక్కవు.
2.గిఫ్టుకార్డులు, మనీ ట్రాన్స్ఫర్లు, క్రిప్టోకరెన్సీల ద్వారా మాత్రమే పేమెంట్స్ తీసుకొనే సైట్స్/యాప్స్ జోలికి వెళ్లకూడదు. మోసం జరిగితే, డబ్బు వెళ్లిన ఖాతా వివరాలను తెలుసుకోవడం చాలా కష్టం. డబ్బు వాపసు వచ్చే అవకాశం ఉండదు.
3.ఊరూపేరూ లేని కంపెనీలు బ్రాండెడ్ గూడ్స్పై భారీగా డిస్కౌంట్లు ఇస్తామని ఊరిస్తాయి. ఇలాంటివి మోసాలు చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సైట్లకు దూరం ఉండాలి. ఒకవేళ వస్తువులు పంపినా, నకిలీవే అయి ఉంటాయి.
4.వెబ్సైట్ అడ్రస్ కచ్చితంగా https తో మొదలై ఉండాలి. లాక్ బొమ్మ కూడా కనిపించాలి. లేకపోతే ఆ వెబ్సైట్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లు సేఫ్ కాదనే అర్థం. మనకార్డులన్నింటికీ ట్రాన్సాక్షన్ అలర్ట్ వచ్చేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఏవైనా ఫ్రాడ్స్ జరిగితే వెంటనే తెలుస్తుంది.
5.క్రెడిట్కార్డుల కంటే డెబిట్కార్డులతో షాపింగ్ కొంత రిస్కీ వ్యవహారం. ఎందుకంటే డెబిట్కార్డుతో కొంటే డబ్బు నేరుగా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. మోసం జరిగితే తిరిగి డబ్బు ఖాతాలోకి రావడానికి చాలా టైం పడుతుంది. ఈలోపు మన దగ్గర డబ్బు లేకుంటే ఇబ్బందులు తప్పవు.
6.ఇప్పుడు చాలా సైట్లు ‘బయ్ నౌ పే లేటర్’ పేరుతో కస్టమర్లకు క్రెడిట్ ఇస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఉద్దెరకు వస్తువును అమ్ముతాయి. కొంతకాలం తరువాత డబ్బు కట్టాలి. క్రెడిట్కార్డు హోల్డర్లకు ఉండే రక్షణలు ఈ విధానంలో ఉండవు.
7.కార్డు ఫ్రాడ్ జరిగిందనే అనుమానం వస్తే వెంటనే దానిని బ్లాక్ చేయించి కొత్తది తీసుకోవాలి. లేకపోతే సైబర్ క్రిమినల్స్ మళ్లీ అదే కార్డులోనే డబ్బును లాగేస్తారు.
8 బ్యాంకులు ఓటీపీల నంబర్లు, కార్డుల పిన్/సీవీవీ నంబర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అడగవు. ఇలాంటి వివరాలు కావాలని ఎవరు ఫోన్ చేసినా ఇవ్వకూడదు.