దోస్త్ మేరా దోస్త్

దోస్త్ మేరా దోస్త్

‘ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే..’ అన్నట్టుగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొదటి రోజు టూర్ సాగింది. అహ్మదాబాద్ ఎయిర్​పోర్టులో దిగింది మొదలు.. ఆగ్రాకు వెళ్లే దాకా ట్రంప్, మోడీ క్లోజ్ ఫ్రెండ్స్​లా కలిసి నడిచారు. నిజానికి ఇక్కడ కలిసింది ట్రంప్, మోడీ మాత్రమే కాదు.. రెండు దేశాలు..  అమెరికా, ఇండియాలోని 165 కోట్ల మంది ప్రజలు. ‘నమస్తే ట్రంప్’​ ప్రోగ్రామ్​లో కేవలం1.25 లక్షల మంది ఎదుట వీరు మాట్లాడితే.. టీవీలు, స్క్రీన్లలో ప్రపంచం మొత్తం విన్నది.. రెండు దేశాల అనుబంధాన్ని కళ్లారా చూసింది. ఇద్దరు నేతలు కలిసి అహ్మదాబాద్ ఎయిర్​పోర్ట్ నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర వేలాది మంది ప్రజల మధ్య రోడ్​షో నిర్వహించారు. తర్వాత ‘నమస్తే ట్రంప్’ సభ గ్రాండ్​గా జరిగింది.  ఈ టూర్​ నా గుండెల్లో నిలిచిపోతుందని ట్రంప్​ అంటే… రెండు దేశాలు కలిసి పని చేస్తే మొత్తం ప్రపంచానికే గమ్యాన్ని చూపుతాయని మోడీ అన్నారు. ఇండియా, అమెరికా శాశ్వత మిత్రులు.. సహజ మిత్రులు అని ఇద్దరు నేతలు చెప్పారు. తమ ఫ్రెండ్​షిప్​ను మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించారు వారు. సబర్మతి ఆశ్రమంలో.. అంతా కలియతిరిగాక.. ఓ అరుగుపై కూర్చుని మోడీ, ట్రంప్, మెలానియా ముచ్చట్లు చెప్పుకున్నారు.

ఫ్రెండ్..

సోమవారం మధ్యాహ్నం 11.37.. ఎయిర్​ఫోర్స్ వన్ ల్యాండ్ అయింది.. డోర్స్ ఓపెన్ అయ్యాయి.. బ్లూ కలర్​ సూట్​లో ఒకరు.. తెల్లటి డ్రెస్​లో మరొకరు బయటికొచ్చారు.. ఇద్దరూ అడుగులో అడుగేస్తూ.. దిగుతున్నారు.. కింద ఉన్న వ్యక్తి మాత్రం ఎంతో ఆత్రపడుతున్నాడు.. విదేశాల నుంచి వస్తున్న చిన్ననాటి మిత్రుడి కోసం ఎదురు చూస్తున్నట్లుగా తొందరపడుతున్నాడు.. మెట్లు దిగడం ఆలస్యం కౌగిలిలో బంధించాడు.. తన ఫ్రెండ్​కు ఆత్మీయ ఆహ్వానం పలికాడు.. వచ్చింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే… చేయి చేయి కలిపి ఆయన్ను వెంటతీసుకొచ్చిన వ్యక్తి ప్రధాని మోడీ.

బ్రదర్..

సైనిక వందనం స్వీకరించి ట్రంప్, మోడీ ముందుకు సాగారు.. మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.. వెనుక మెలానియా ఒక్కరే మెల్లగా వస్తున్నారు. వెంటనే గమనించారు మోడీ.. వెనక్కి వెళ్లి ఓ సోదరుడిలా పలకరించారు. చొరవ తీసుకుని ముందుకు పదండి అన్నట్లుగా చేయి చాచారు.. కళాకారుల డ్యాన్స్​లు.. డప్పుల మోతల గురించి ఆమెకు వివరించారు.. ముందుకు సాగి ట్రంప్​కు జత కలిశారు.

టీచర్..

సబర్మతి ఆశ్రమం.. ట్రంప్ దంపతుల కన్నా కొన్ని క్షణాలు ముందుగా వెళ్లారు మోడీ. వారికి ఆశ్రమం గురించి వివరించారు. అప్పట్లో మహాత్ముడు తిప్పిన చరఖా దగ్గరికి తీసుకెళ్లారు.. అక్కడికి వెళ్లగానే చిన్న పిల్లాడిలా మారిపోయారు ట్రంప్.. మోకాళ్లు నేలకు ఆనించి చరఖా పక్కన కూర్చున్నారు. రాట్నాన్ని ఆసక్తిగా గమనించారు.. ఆయన పక్కనే మెలానియా కూర్చున్నారు. వారికి చరఖా గురించి వివరించారు మోడీ. టీచర్​లా మోడీ చెబుతుంటే.. స్టూడెంట్లలా ఆసక్తిగా విన్నారు ట్రంప్ దంపతులు.. ‘త్రీ మంకీస్’ గురించి కూడా వాళ్లకి మోడీ వివరించారు.