
ప్రధాని మోడీ ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.సబర్మతి ఆశ్రమంలో 15 నిమిషాలు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన డొనాల్డ్ ట్రంప్, మెలానియా.. అక్కడ మహాత్మా గాంధీకి ఘన నివాళి అర్పించారు. కొన్ని నిమిషాలు ముందుగానే ఆశ్రమంలోకి వచ్చిన మోడీ.. అప్పట్లో గాంధీ, కస్తూర్బా నివసించిన ‘హృదయ్ కుంజ్’ను వారికి చూపించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆశ్రమం పోషించిన పాత్రను వివరించారు. చరఖాపై ట్రంప్ కాసేపు నూలు వడికారు. ఆయనకు మెలానియా సాయం చేశారు. నూలు వడకడం ఎలానో మోడీ వివరించారు. కొద్ది సేపు ముగ్గురు నేలపై కూర్చున్నారు. తర్వాత విజిటర్స్బుక్లో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. ‘‘అద్భుతమైన సందర్శనకు అవకాశం కల్పించిన నా ఆత్మీయ మిత్రుడు నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు’’ అని ట్రంప్ రాశారు. అయితే గాంధీ గురించి అందులో ఏమీ రాయకపోవడం గమనార్హం. తర్వాత ‘త్రీ మంకీస్’ ద్వారా గాంధీజీ చెప్పిన అహింస సిద్ధాంతాన్ని వారికి ప్రధాని మోడీ వివరించారు. దాదాపు 15 నిమిషాలు అక్కడ గడిపారు.