
- నడిగడ్డలో లక్కీ డ్రా తీసి వదిలేసిన అధికారులు
- గోన్పాడులో మూలకుపడ్డ ఇండ్లు
- దౌదర్ పల్లిలో సౌలతులు కరువు
గద్వాల, వెలుగు: గద్వాల నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ వ్యవహారం రెండేండ్లుగా పెండింగ్లో ఉంది. దౌదర్ పల్లి దర్గా వద్ద నిర్మించిన ఇండ్లు వృథాగా ఉండగా, గద్వాల మండలం గోన్పాడు వద్ద నిర్మించిన ఇండ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 1,275 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టగా, అసెంబ్లీ ఎన్నికల ముందు 770 ఇండ్లకు లక్కీ డ్రా తీశారు. గతంలో ఇచ్చిన ఇంటి స్థలం పట్టాలు గుంజుకొని తమకు అన్యాయం చేశారని కొందరు కోర్టుకు వెళ్లగా, వారి కోసం 505 ఇండ్లు పక్కన పెట్టారు.
ఎన్నికల ముందు వరకు పనులు కంప్లీట్ కాకపోవడంతో లబ్ధిదారులకు వాటిని కేటాయించలేదు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ రావడంతో హడావుడిగా లక్కీ డిప్ తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే వారికి ఇండ్లు కేటాయించకపోవడంతో లబ్ధిదారులు తమకు ఏ ఇల్లు కేటాయించారో తెలియక అయోమయంలో ఉన్నారు.
ఒక్క ఇల్లు కేటాయించలే..
2018లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గద్వాల నియోజకవర్గానికి 2,500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపిక కోసం పట్టణంలో దరఖాస్తులు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అర్హులను ఎంపిక చేసేందుకు ఎంక్వైరీ చేశారు. 4 వేలకు పైగా అర్హులు ఉన్నట్లు తేల్చారు. గద్వాల నియోజకవర్గంలో 1,275 ఇండ్లు మాత్రమే ఉండడంతో, కోర్టుకు వెళ్లిన వారికి 505 ఇండ్లు పక్కన పెట్టి మిగిలిన ఇండ్లకు ఆఫీసర్లు లక్కీ డిప్ తీశారు. ఎన్నికల కోడ్ కొన్ని గంటల్లో వస్తుందనగా, లబ్ధిదారులకు తెలియకుండా, వారితో గృహప్రవేశం చేయించకుండానే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హడావుడిగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఓపెన్ చేశారు. లక్కీ డిప్లో ఇల్లు వచ్చిన వారికి ఎన్నికల తరువాత ఇస్తామని చెప్పారు. ఏండ్లు గడస్తున్నా ఇండ్ల పంపిణీ ఊసెత్తడం లేదు.
కూలిపోయేలా ‘డబుల్’ ఇండ్లు..
గద్వాల మండలం గోన్పాడు విలేజ్ దగ్గర నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయి. విరిగిపోయిన డోర్లు, పగిలిపోయిన అద్దాలతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆ ఇండ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. గద్వాల సమీపంలోని దౌదర్పల్లి దర్గా దగ్గర నిర్మించిన ఇండ్ల వద్ద సౌలతులు కల్పించాల్సి ఉంది. కలెక్టర్ స్వయంగా వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. పెండింగ్ పనులు కంప్లీట్ చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని సూచించారు. ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సమస్యలు అలాగే ఉన్నాయి.
ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..
డబల్ బెడ్రూమ్ ఇండ్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వ సూచనల ప్రకారం ముందుకెళ్తాం.
అలివేలు, ఆర్డీవో, గద్వాల