
- ఆందోళన చేపట్టినా పట్టించుకోని అధికారులు
- ఎదురు చూడలేక ఇండ్లలోకి వెళ్లి వంటావార్పు
హనుమకొండ, వెలుగు: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కట్టిస్తామంటే గుడిసె వాసులు స్థలాలు ఇచ్చారు.. కట్టించి ఏండ్లు కావస్తున్నా ఇండ్లు ఇవ్వకపోతుండడంతో ఎదురు చూసి చివరకు తాళాలు పగులగొట్టి అనధికారికంగా లోపలికి ప్రవేశించారు. వంటా వార్పు చేసుకున్నారు. తమకు ఇల్లు దక్కిందంటూ సంతోష పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. 2015 జనవరిలో వరంగల్సిటీలోని స్లమ్ ఏరియాల్లో పర్యటనలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్..అంబేదర్క్ నగర్, జితేంద్రసింగ్నగర్ గుడిసె వాసులకు డబుల్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
గుడిసెలను ఖాళీ చేయించగా.. దాదాపు 250 కుటుంబాలు హనుమకొండ ఏషియన్ మాల్పక్కన ప్రైవేటు స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. అనంతరం 13 బ్లాకుల్లో 594 డబుల్ ఇండ్ల నిర్మాణం చేపట్టి 2018లో పనులు పూర్తిచేశారు. కానీ.. వాటిని లబ్ధిదారులకు కేటాయించకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారు. గుడిసెవాసులు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది.
2021 ఏప్రిల్ లో బల్దియా ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కొందరు గుడిసె వాసులకు ఇండ్లు కేటాయిస్తూ ప్రొసీడింగ్ లెటర్లు అందించారు. కానీ ఇండ్లలోకి అనుమతించకపోవడంతో ఇన్నాళ్లు గుడిసెల్లోనే ఉండిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా కేటాయిస్తారేమోనని పలుమార్లు ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్, ఇతర అధికారుల చుట్టూ తిరిగినా నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం డబుల్ ఇండ్ల వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో తాళాలు పగులగొట్టి ఇండ్లలోకి వెళ్లారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పదేండ్లుగా గుడిసెల్లో బతుకు వెళ్లదీశామని అంబేద్కర్ నగర్వాసులు వాపోయారు. డబుల్ ఇండ్లకు ఆశపడి గుడిసెలు ఖాళీ చేసి స్థలం ఇస్తే మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పటికే 576 మంది లిస్ట్ ఫైనల్చేశారని, అయినా ఇండ్లు ఇవ్వడానికి మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇకనైనా అధికారికంగా అర్హులకు మిగతా ఇండ్లు కేటాయించాలని పలువురు డిమాండ్ చేశారు.