
హైదరాబాద్ జిల్లాలో ఈసారి బీఆర్ఎస్ కు ఎదురు గాలులు వీస్తున్నాయి. పార్టీలో టికెట్లు ఆశించే వారు ఎక్కువ కావడం, వర్గపోరు ఇతర పార్టీలకు కలిసొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో అధికార పార్టీకి షాక్ తగిలే అవకాశాలున్నాయి. లక్ష మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పడంతో నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 4 వేల మందికి మాత్రమే ఇవ్వడంతో మిగతా వారు నిరాశలో ఉన్నారు. కేవలం మురికివాడల్లో ఉన్న గుడిసెల స్థానంలో మాత్రమే ప్రభుత్వం ఇండ్లను నిర్మించి ఇచ్చింది. కానీ, ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని వారికి ఇవ్వలేదు. జిల్లాలోని అన్ని నియోకవర్గాల్లో ఇదే సమస్య ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలకు ముందే ఇండ్లు ఇస్తే రాని వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మొత్తానికే ఇవ్వకపోతే అందరి నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇక పాతబస్తీలో ఎంఐఎంకు తిరుగులేదు. ఇక్కడ హామీలు, ప్రభుత్వ పథకాలు, అభ్యర్థులు ఎవరేనది అవసరంలేదు. ఎంఐఎం నుంచి ఎవరు పోటీలో ఉంటే వారే గెలవడం అనవాయితీగా వస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో నాంపల్లిలో ఎంఐఎంకు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ బలమైన అభ్యర్థి కావడం, ఇప్పటికే రెండు సార్లు ఓడిపోవడంతో జనాల్లో ఆయనపై సానుభూతి ఉంది. దీంతో ఎంఐఎం ఏడు సీట్లలో ఒకటి తగ్గొచ్చు.
అంబర్పేటను దక్కించుకునేందుకు బీజేపీ ప్లాన్
నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలోవర్గపోరు నడుస్తోంది. సిట్టింగులకే మరోసారి టికెట్లని సీఎం ప్రకటించినప్పటి నుంచి ఇది తీవ్రమైంది. ఈసారి టికెట్ కోసం దూసరి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది లీడర్లు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ నుంచి లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. నియోజకవర్గంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరుసగా గెలిచారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున కిషన్రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ ఎంపీ స్థానానికే పోటీ చేయాల్సి వస్తే ఆయన భార్య కావ్యరెడ్డిని నిలబెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. అలాగే పద్మా వెంకటరెడ్డి, గౌతమ్ రావులు కూడా టికెట్ ఆశిస్తున్నారు.
ముఠా గోపాల్ కు ఆ ఇద్దరి సెగ
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ వచ్చే ఎన్నికల్లో తన కొడుకు ముఠా జై సింహాను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే ఆ పార్టీ నుంచి ఎమ్మెన్ శ్రీనివాస్, నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఆరు డివిజన్లలో ఎక్కడా అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు లేకపోవడం ఆ పార్టీకి మైనస్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోవడంతో ఈసారి ఆయన తండ్రి అంజన్ కుమార్ నిలబడాలని చూస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ నిలబడే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ లక్ష్మణ్ పోటీ చేయకపోతే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి, మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి సి కె శంకర్, రాంనగర్ కార్పొరేటర్ రవి చారి, బీజేవైఎం మాజీ అధ్యక్షుడు భరత్ గౌడ్, బీజీపీ స్టేట్ ఫైనాన్స్ సెక్రెటరీ ప్రవీణ్ చంద్ర, ప్రఫూల్ రామ్ రెడ్డి, సూర్యనారాయణ శర్మ, రమేశ్రామ్, నవీన్ గౌడ్, వినయ్ కుమార్, ఇండస్ట్రియల్ సెల్ కన్వీనర్ పార్థసారథి టికెట్ఆశిస్తున్నారు.
గోషామహల్ బీజేపీ సీటు ఎవరిది?
గోషామహల్ లో ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. మత ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పీడీ యాక్టు నమోదైంది. దీంతో పార్టీ సస్పెండ్ చేసింది. త్వరలోనే సస్పెన్షన్ ఎత్తివేస్తుందని, మళ్లీ ఆయన పోటీ చేస్తారని అనుచరులు చెబుతున్నారు. అయితే రాజాసింగ్ను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. దీంతో గోషామహల్ నుంచి బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్, గోల్కొండ జిల్లా అధ్యక్షుడు వి పాండు యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రేమ్ సింగ్ రాథోడ్ రేసులో ఉన్నారు. ఈయనతో పాటు నందకిషోర్ వ్యాస్, ఆర్వీ మహేందర్ కుమార్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ కు అభ్యర్థులు కరువయ్యారు.
లష్కర్లో పద్మారావుపై వ్యతిరేకత
సికింద్రాబాద్ నియోజకవర్గంలో గత రెండు సార్లు గెలిచిన టి పద్మారావు గౌడ్ పై వ్యతిరేకత ఉంది. పెద్దగా అభివృద్ధి చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. పార్టీ కార్యకర్తలను తప్ప సాధారణ ప్రజలను పెద్దగా పట్టించుకోరన్న అపవాదు ఉంది. దళితబంధును కూడా కార్యకర్తలు, ఉన్నోళ్లకే ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వలేదు. ప్రజల కోసం నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాలును సొంత పనులకు వాడుకుంటున్నారన్న అపవాదు ఉంది. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్అసెంబ్లీ స్థానం నుంచి తన కొడుకును నిలబెట్టి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో పాటు మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బండపల్లి సతీష్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఆదం సంతోష్ కుమార్, సందీప్ ప్రధానంగా టికెట్ రేసులో ఉన్నారు.
సనత్ నగర్ పై తలసాని ధీమా
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నియోజకవర్గమైన సనత్ నగర్ లో రూ.1500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని, వచ్చేసారి సీటుతో పాటు గెలుపు కూడా తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనను కొన్ని అంశాలు కలవరపరుస్తున్నాయి. గత పార్లమెంట్ఎన్నికల్లో ఆయన కొడుకు సాయికిరణ్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ నేత కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఆయన నివాసముండే మార్కెట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు. మంత్రికి గట్టి పట్టున్న రామ్ గోపాల్పేట డివిజన్లో కూడా బీజేపీ పాగా వేసింది. సెటిలర్ల మద్దతు పుష్కలంగా ఉందని నమ్ముతున్న ఆయనకు అమీర్పేట డివిజన్లోనూ షాక్ తగిలింది. ఇక్కడ బీజేపీ గెలిచి సవాల్ విసిరింది. మంత్రి అయిన తర్వాత అనుచరులను, కింది స్థాయి కార్యకర్తలను పక్కనపెట్టారన్న ఆరోపణలున్నాయి. వారు అసంతృప్తితో ఉన్నారు. దీంతో బీజేపీ ఇక్కడ పాగా వేయడానికి ప్లాన్ వేస్తోంది. ఇక్కడ రాష్ట్రేతరులు ఎక్కువ. వీరంతా బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతునిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన మర్రి శశిధర్రెడ్డి బీజేపీలో చేరగా ఆయనతో పాటు మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్గౌడ్, రాంగోపాల్పేట్ కార్పొరేటర్ భర్త చీరా శ్రీకాంత్ టికెట్లు ఆశిస్తున్నారు. మర్రి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్బలహీనపడింది. పటిష్టమైన కేడర్ ఉన్నా పోటీ చేసే గట్టి లీడర్లేడు.
ఖైరతాబాద్ లో ట్రయాంగిల్ ఫైట్
ఖైరతాబాద్ లో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. బీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. అందరికీ డబుల్ ఇండ్లు అంటూ దానం నాగేందర్ అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ, ఆ హామీ నిలబెట్టుకోలేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో మైనస్గా మారే అవకాశం ఉంది. ఖైరతాబాద్ లో కేవలం 200 ఇండ్లు మాత్రమే ఇవ్వడం, అవి కూడా ఖైరతాబాద్ చెరువు విస్తరణలో ఇల్లు, ఇండ్ల స్థలాలు కోల్పోయిన వాళ్లకే దక్కడంతో ఇండ్లు రాని వారు గుస్సా అవుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే దానం అక్రమ భూ దందాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నుంచే మేయర్ గద్వాల విజయలక్ష్మి, కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి భర్త మన్నే గోవర్ధన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మన్నే గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జీగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన పీజేఆర్ కూతురు విజయా రెడ్డి ఇటీవల కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆమె తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న రోహన్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో టికెట్ పై ఆశతో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి రేసులో ఉన్నారు. పల్లపు గోవర్ధన్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మనవడు, బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ సైతం టికెట్ఆశిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ లో మాగంటికి పోటీ ఏది?
మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే జూబ్లీహిల్స్ కొంత భిన్నంగా ఉంటుంది. హైఫై కల్చర్తో పాటు బస్తీలు కూడా ఎక్కువే. మైనారిటీ, సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ అధికార పార్టీకి బలమైన ప్రత్యర్థి లేకపోవడం కలిసివచ్చే అంశం. బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేకు, ఫసియుద్దీన్కు పడడం లేదు. పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. ఎన్నికలప్పుడే ప్రజల్లోకి వచ్చి, తర్వాత కనిపించకుండా పోతారన్న పేరు ఉంది. బీజీపీ విషయానికొస్తే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన లంకాల దీపక్ రెడ్డి, జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు వీరపునేని పద్మ, యువజన విభాగం నేత సందీప్ యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు.
ఆరు నియోజకవర్గాల్లో ఎంఐఎం పట్టు
మలక్పేట్, బహదూర్పుర, చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్పుర, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో ఎంఐఎం ఏ అభ్యర్థిని నిలబెట్టినా వారిదే గెలుపనే పేరుంది. కానీ, ఈ సారి నాంపల్లి నియోజకవర్గంలో ఎంఐఎంకు తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. గతంలో నాంపల్లిలో కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఓడిపోయిన సెంటిమెంట్ తో పాటు ఎప్పుడు ప్రజల్లో మమేకమై ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. ఒకప్పుడు బీజేపీకి కంచుకోటగా ఉన్న కార్వాన్ లో బీజేపీ అంతగా ప్రభావం చూపించడం లేదు. ఇక్కడ గతంలో బద్దం బాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన తర్వాత అంత బలమున్న నేత లేకపోవడంతో బీజేపీకి కలిసి రావడం లేదు.
సాయన్న మరణంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేదెవరు?
కంటోన్మెంట్ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న ఇటీవల ఆనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు పావులు కదుపుతున్నారు. సానుభూతి వర్కవుట్అయ్యే అవకాశాలు ఉండడంతో సాయన్న కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వాలని స్థానిక కార్యకర్తలు, అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కవాడిగూడ కార్పొరేటర్ గా పనిచేసిన సాయన్న కూతురు లాస్య నందిత తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తన తండ్రి పేరు, సానుభూతి కలిసి వచ్చి గెలుస్తానని చెబుతున్నారు. అయితే సాయన్న అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించకపోవడం చూస్తే టికెట్ ఇస్తారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు మంత్రి హరీశ్రావు ఆశీస్సులతో ఎర్రోళ్ల శ్రీనివాస్, మంత్రి కేటీఆర్ సపోర్ట్తో సర్వే సత్యరానాయణ అల్లుడు క్రిషాంక్ టికెట్కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంపై కన్నేసినట్టు సమాచారం. చెన్నూర్ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఈసారి కంటోన్మెంట్ కు మారాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు గజ్జెల నగేశ్, శ్రీగణేష్ కూడా అధికార పార్టీ నుంచి టికెట్ఆశిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు.