
'మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ గుప్పెడు మనసు సినిమాలోని ఈ పాట ఎందరో సంగీత ప్రియులను ఆకట్టుకుంది.‘తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు.. కల్లులు కాగానే కన్నీరౌతావు’ అంటూ బ్యాగ్రౌండ్లో ఒక గొంతు పాడుతూ ఉంటే ఆ గాత్రమాధుర్యం తెలుగు ప్రేక్షకులు ముగ్ధుల్ని చేసింది. ఎన్నో సినిమాల్లో వినిపించి మురిపించిన ఆ గాత్రమే మంగళంపల్లి బాల మురళీకృష్ణది.
తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా, శంకర గుప్తంలో 1930లో పుట్టారు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. కర్ణాటక సంగీత గాయకుడిగా, వయొలిన్ విద్వాంసుడిగా, వాగ్గేయకారుడిగా ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నారు. ఎనిమిదేళ్లకే కచేరీలు చేయడం మొదలుపెట్టిన మంగళంపల్లి.. వయొలిన్, మృదంగం, కంజీరా తదితర ఇన్స్ట్రుమెంట్స్ లో ప్రావీణ్యం సంపాదించారు.
మంగళంపల్లి తన సంగీతంతో పలు సినిమాలకూ శ్రావ్యతను అద్దారు . ‘భక్తప్రహ్లాద’లో నారదుడిగా నటించి మెప్పించారు. ‘సతీ సావిత్రి’ సినిమా కోసం తొలిసారి పాట పాడారు. ఆ తర్వాత జయభేరి, కర్ణ, నర్తనశాల, దొరికితే దొంగలు, ఉయ్యాల జంపాల, పల్నాటి యుద్ధం, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ, భక్తప్రహ్లాద, అందాల రాముడు, ముత్యాల ముగ్గు త సినిమాల్లో పాడారు. తెలుగుతో పాటు తమిళ చిత్రాలకు పాడారు మంగళంపల్లి. కళైకోవిల్, మిరుతంగ చక్రవర్తి, పసంగ చిత్రాల్లో ఆయన గొంతు వినిపించింది. మాలీవుడ్లో ఆరు సినిమాలకు పాడారు. ‘సందెన సింధూరం’ అనే మలయాళ చిత్రంలో నటించారు కూడా. కన్నడ భాషలోనూ మూడు సినిమాలకు పాటలు పాడటంతో పాటు రెండు చిత్రాలకు సంగీతం అందించారు. సంస్కృత చిత్రాలు ఆదిశంకరాచార్య, భగవద్గీతలకు కూడా ఆయనే సంగీత దర్శకులు.
ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు బాలమురళీ కృష్ణ. ఎన్నో కొత్త రాగాలను కనిపెట్టారు. సంగీత కళానిధి, కళాభూషణ, గాయక శిఖామణి, గంధర్వ నాగ సామ్రాట్ తదితర బిరుదుల్ని మంగళంపల్లిని వరించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.
వాగ్గేయకారుడిగానే కాక సినిమాల ద్వారా కూడా ఎన్నో దశాబ్దాల పాటు అలరించిన సంగీత నిధి మంగళంపల్లి. ఆది అనాదియు నీవే దేవా, వరమొసగే వనమాలి, సలలిత రాగ సుధారస సారం, మేలుకో శ్రీరామా, పాడనా వాణి కళ్యాణిగా అంటూ ఆయన పాడిన ప్రతి పాట ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఆయన స్వర మాధురి నేటికీ మనోవీణల్ని మీటుతూనే ఉంది. అందుకే అంటారు.. కొందరు మరణించినా ఎందరో హృదయాల్లో జీవించే ఉంటారని!