
హైదరాబాద్, వెలుగు: సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న డాక్టర్ నోరి.. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ల అభివృద్ధి, క్యాన్సర్ నివారణ, నిర్మూలన కార్యక్రమాల్లో సలహాలు, సూచనలు అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు, వీటి ట్రీట్మెంట్లోనూ ఆయన సహకారం తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు.
గతంలో 2021 అక్టోబరు నుంచి 2023 సెప్టెంబరు వరకు ఈ పదవిని నిర్వహించిన డాక్టర్ నోరి.. అమెరికాలోని మెమోరియల్ స్లోన్ క్యాటరింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ విభాగంలో హెడ్గా పనిచేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేసిన ఆయన.. మహిళల్లో క్యాన్సర్ చికిత్సలో నిపుణుడిగా పేరు పొందారు. అలాగే, బసవతారకం ఆసుపత్రి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 50 ఏళ్ల పాటు క్యాన్సర్ చికిత్స సేవలకు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నుంచి ‘ట్రిబ్యూట్ టు లైఫ్’ గౌరవం అందుకున్నారు. 2015లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది.