కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు DRDO తయారు చేసిన 2DG డ్రగ్ (2 డయాక్సీ డి గ్లూకోజ్)ను ఇవాళ(సోమవారం) మార్కెట్లోకి రిలీజ్ చేసినట్లు రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. DRDO కు చెందిన 2 DG డ్రగ్ రెడ్డీస్ ల్యాబ్ ఫార్మసీలో తయారు చేస్తున్నారు. రెండు నెలల క్రితం 2 DG డ్రగ్ ను ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్, హర్షవర్ధన్ విడుదల చేశారు. మొదట 10వేల 2డీజీ డోసులను ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు పంపిణీ చేశారు. పొడి రూపంలో ఉన్న ఈ డ్రగ్ ను నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని DRDO వివరించింది. కమర్షియల్గా 2DGTM పేరుతో ఈ డ్రగ్ ను రెడ్డీస్ ల్యాబ్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది.
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పౌడర్ను డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీ సహకారంతో అభివృద్ధి చేసింది. 2డీజీ డ్రగ్ను కరోనా రోగులకు అత్యవసర వినియోగానికి ఇటీవల DCGI పర్మిషన్ ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో DRDOకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కరోనాలక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలిందని డీఆర్డీఓ తెలిపింది.