మంగపేట, వెలుగు: ప్రకృతి సమతుల్యం దెబ్బతినడం వల్లే విధ్వంసం జరిగిందని పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ సుతారీ సతీశ్ అన్నారు. ఇటీవల ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామ సమీపంలో చెట్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఆదివారం ఆ ప్రాంతాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం పరిశోధక బృందంతో కలిసి సతీశ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి చెట్ల వేర్లు నేల పై భాగంలోనే విస్తరించే ఉండడం వల్ల బలమైన గాలులకు నేలకొరిగినట్లు చెప్పారు. సుమారు 200 చెట్లు విరిగిపడగా ఇందులో తునికి, దుంపెన, తానిక్కాయ, విషముష్టి, యూకలిప్టస్, కానుగా, జువ్వి చెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. గతంలో కూడా మేడారం ప్రాంతంలో 800 ఎకరాల్లోని సుమారు 1.50లక్షల చెట్లు నేలకొరిగినట్లు చెప్పారు.
