T20 World Cup: అభిషేక్ శర్మని జట్టు నుంచి తప్పించండి.. ఫైనల్కి ముందు మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

T20 World Cup: అభిషేక్ శర్మని జట్టు నుంచి తప్పించండి.. ఫైనల్కి ముందు మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక సూచన చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించి రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వాలని తెలిపాడు. ఈ టోర్నమెంట్‌లో అభిషేక్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నాడు. జింబాబ్వేపై ఒక అర్ధశతకం తప్ప ఇతర మ్యాచ్‌లలో అతను పెద్దగా రాణించలేదని గుర్తు చేశాడు. బ్యాటింగ్‌లోనే కాదు, ఫీల్డింగ్‌లో కూడా అతను కొన్ని కీలక క్యాచ్‌లు వదిలేయడంతో జట్టుపై తీవ్ర ప్రభావం చూపించిందని వ్యాఖ్యానించాడు.

టీ20 వంటి చిన్న ఫార్మాట్‌లో మార్పులు చేయడం తప్పు కాదు.. వెస్టిండీస్ జట్టు కూడా ఇదే విధంగా రోస్టన్ చేజ్‌ను ఓపెనర్‌గా పంపింది అని మహమ్మద్ కైఫ్ తెలిపారు. పెద్ద మ్యాచ్ కి ముందు మార్పులు చేయడం కొన్నిసార్లు జట్టుకు ప్రయోజనం కలిగిస్తుందని వెల్లడించాడు. సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకురాగానే అతను అద్భుతంగా ఆడాడు.. ఆ మార్పుతో జట్టుకు లాభం కలిగిందన్నారు. భారత జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్స్ చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చాడు. రింకూ సింగ్ ఎక్కడ ఆడినా పరుగులు చేసే ఆటగాడు.. టెస్టులు, రంజీ ట్రోఫీ లేదా ఐపీఎల్ అయినా అతడు తన ప్రతిభను నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు. ఒక ఆటగాడు ఫామ్‌లో లేకపోతే, బయట మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్ కి అవకాశం ఇవ్వడం తప్పు కాదని చెప్పాడు. డగౌట్‌లో రింకూ సింగ్ ఉన్నప్పుడు అతనికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదని కైఫ్ ప్రశ్నించాడు. 

అభిషేక్ శర్మను సంజు శాంసన్‌తో పోల్చడం సరికాదని కైఫ్ అన్నారు. అభిషేక్ ఇంకా ఐసీసీ టోర్నమెంట్‌లలో కొత్త ప్లేయర్, శాంసన్ మాత్రం అనుభవజ్ఞుడైన ఆటగాడని వివరించాడు. అతడు టీ20 క్రికెట్‌లో 8000కుపైగా పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ హిట్టర్లలో ఒకడిగా నిలిచాడు. ఇప్పటికే స్థిరమైన ఆటగాడిగా శాంసన్ గుర్తింపు పొందాడు. కానీ అభిషేక్ శర్మ ఇంకా యంగ్ క్రికెటర్ మాత్రమే.. తన ఆటను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరో ఆటగాడు వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపై కూడా చర్చ జరుగుతున్నప్పటికీ అతన్ని జట్టు నుంచి తప్పించే అవకాశం తక్కువగా ఉందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తెలిపాడు. వరుణ్‌ చక్రవర్తి వచ్చే మ్యాచ్‌లో తన బౌలింగ్ లైన్‌ను మార్చి మెరుగ్గా బౌలింగ్ చేసే ఛాన్స్ ఉందన్నాడు.