
- ప్రపంచానికి విశ్వశాంతి ఎంతో అవసరం
- ఆధ్యాత్మిక మహోత్సవ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్, వెలుగు : మనది ప్రజాస్వామిక దేశమని, ఆధ్యాత్మికతకు జన్మభూమి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో విభిన్న సంస్కృతులున్నా.. ప్రజలు ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవిస్తారన్నారు. విశ్వశాంతికి ఆధ్యాత్మికత దోహదపడుతుందని తెలిపారు. ఆధ్యాత్మికతలో భేదభావాలకు, మనుషుల మధ్య విభజనకు చోటు లేదన్నారు. సిటీలోని శ్రీరామచంద్ర మిషన్కు చెందిన కన్హ శాంతి వనంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక మహోత్సవ్లో శుక్రవారం రాష్ట్రపతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఆధ్యాత్మిక మహోత్సవ్తో మనశ్శాంతి లభించడమే కాకుండా, విశ్వకల్యాణానికి ఉపయోగపడుతుందన్నారు. ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికీ మేలు చేస్తుందని చెప్పారు. ‘‘ఆధ్యాత్మిక మహోత్సవ్ ప్రతి ఒక్కరినీ కలుపుతుంది. వసుధైవ కుటుంబం అనే సూక్తికి అద్దం పడుతుంది. మన సంస్కృతి ప్రపంచమంతా విస్తరించింది. ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. సమత మన ఆధ్యాత్మిక పరంపరకు ఆధారం.
నైతికత, ఆధ్యాత్మికతలు సమాజానికి మేలు చేస్తాయి. మన దైనందిన జీవితాలు ఆ రెండింటితోనూ ముడిపడి ఉన్నాయి. ఇంట్లో ఉన్నా.. పనిలో ఉన్నా ఆ రెండింటినీ పాటించాలన్నది మన పూర్వీకులు చెప్పిన మాట. ఆ వారసత్వాన్ని కొనసాగించినవాళ్లు జీవితంలో వృద్ధి సాధిస్తారు. సంతోషంగా జీవిస్తారు. మనం చేసే పనులతో విజయం వరించడంతోపాటు మనశ్శాంతి దక్కుతుంది. ఇవే మన నీతి, ఆధ్యాత్మిక శాస్త్రాలు మనకు పదే పదే చెప్తున్న జీవిత సత్యాలు’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఎయిర్పోర్టులో స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
ఆధ్యాత్మిక మహోత్సవ్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎయిర్పోర్టులో గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్రెడ్డి స్వాగతం పలికారు. సచివాలయంలో అటవీ శాఖ రివ్యూలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్రెడ్డి నేరుగా శంషాబాద్ఎయిర్పోర్టుకు వెళ్లారు.