డ్రగ్స్ డోర్ డెలివరీ: జూబ్లీహిల్స్‌ అడ్డాగా దందా

డ్రగ్స్ డోర్ డెలివరీ: జూబ్లీహిల్స్‌ అడ్డాగా దందా

జూబ్లీహిల్స్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. ఆర్డర్లపై డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం మంగళవారం అరెస్టు చేసింది. వారి నుంచి 7 గ్రాముల కొకైన్, 2 గ్రాముల ఓపియం, రూ.1.13 లక్షలు, 3 బైకులు స్వాధీనం చేసుకుంది. కేసు వివరాలను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి తెలిపారు.

అటు అర్డర్‌.. ఇటు సప్లై…

జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్‌కు చెందిన షేక్ ఫహాద్ (40) రోడ్ నంబర్ 5 అడ్డాగా డ్రగ్స్ దందా ప్రారంభించాడు. హైదర్షాకోట్‌లో ఉండే నైజీరియన్ పీటర్ నుంచి కొకైన్, ఓపియంను కొని అమ్మేవాడు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు హైటెక్‌సిటీ, గచ్చిబౌలిల్లోని తన కస్టమర్లకు డ్రగ్స్‌ను పీటర్ నుంచి ఆర్డర్ చేస్తూ సప్లయ్ చేసేవాడు. 6 నెలలుగా డోర్ డెలివరీతో పాటు డ్రగ్ సేల్ పాయింట్స్‌తో దందా నడిపిస్తున్నాడు.

ముగ్గురితో డోర్‌ డెలివరీ..

కర్నాటక గుల్బర్గాకు చెందిన బగారి సంతోష్ (21), టోలిచౌకీకి చెందిన మహ్మద్ మసూద్(38), వరంగల్ జిల్లా కొత్తగుడెంకు చెందిన నారగాని సురేశ్‌ (35)ను డ్రగ్స్ సప్లయర్లుగా ఫహాద్‌ చేర్చుకున్నాడు. వీళ్ల కోసం ఫిల్మ్ నగర్ రోడ్ నంబర్ 5లో షెల్టర్ ఏర్పాటు చేశాడు. జీతాలు, భోజన వసుతులు కల్పిస్తూ డ్రగ్స్ డోర్‌ డెలివరీ చేయించేవాడు. కూకట్‌పల్లి,  మాదాపూర్, గచ్చిబౌలి, మాసబ్‌ట్యాంక్, గచ్చిబౌలిలో డ్రగ్ పాయింట్లనూ ఏర్పాటు చేశాడు.