సెల్ ఫోన్స్, వెహికల్స్ మార్చుతూ గంజాయి రవాణా .. రూ.45 లక్షల గంజా సీజ్ చేసిన దుండిగల్ పోలీస్

సెల్ ఫోన్స్, వెహికల్స్ మార్చుతూ గంజాయి రవాణా .. రూ.45 లక్షల గంజా సీజ్ చేసిన దుండిగల్ పోలీస్

దుండిగల్: పోలీసుల కళ్లుగప్పి తరలిస్తున్న గంజాయిని మేడ్చల్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు రూ. 45 లక్షల విలువచేసే గంజాయిని తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో మేడ్చల్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు కలిసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. సోమవారం దుండిగల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా హర్యానా రాష్ట్రానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో దుండిగల్ ఔటర్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించారు. 

సాయంత్రం 4.30 గంటలకు టాటా కారులో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాకు చెందిన సాగర్ పవార్(23)ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. సెల్ నంబర్లు మారుస్తూ గంజాయిని ఒక వెహికల్ నుంచి మరో  వెహికల్ కు మారుస్తూ వినూత్న రీతిలో తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 43 ప్యాకెట్లలో 120.17 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.  నిందితుడి నుంచి టాటా వెహికల్, ఐదు సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిపారు. మరో నలుగురు నిందితులు దేవరాజ్, భజరంగ్, హనుమంతు పవార్, రాజకుమార్‌‌‌‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.