ఫార్మా మందుల ఉత్పత్తిలో ప్రపంచంలోమూడో స్థానంలో ఉంది ఇండియా. 2020 నాటికిదేశ ‘ఫార్మా’ విలువ 3 లక్షల 80 వేల కోట్ల రూపాయల మార్కును అందుకోనుంది. ఓరకంగా ఇండియాను ‘ఫార్మాసిటీ ఆఫ్ ది వరల్డ్ ’ అంటుంటారు. కానీ ఈ పేరును చెడగొడుతున్నారు. కాలంచెల్లిన, నకిలీ మందులను అమ్ముతూ దేశాన్ని విమర్శలపాలు చేస్తున్నారు. ఇండియాలో నకిలీ మందులెక్కువయ్యాయని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(యూఎస్ టీఆర్ ) ఇటీవలి ‘స్పెషల్ 301 రిపోర్ట్’లోవెల్లడించింది. దేశంలో అమ్ముతున్న మందుల్లో 20శాతం నకిలీవేనంది. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారని విమర్శించింది. పైగా అమెరికా, యూరోపియన్ యూనియన్ , ఆఫ్రికా, దక్షిణ అమెరికా, కెనడాలకూ నకిలీని అంటిస్తున్నారని మండిపడింది.
7 లక్షల మంది బలి
విదేశాలకు నకిలీ ఫార్మా మందులను చైనా,ఇండియా, ఇండోనేసియా, థాయ్ లాండ్ దేశాలు అంటగడుతున్నాయని స్పెషల్ రిపోర్టును విడుదలచేసిన యూఎస్ స్టేట్ రిప్రజెంటేటివ్ మండిపడింది. 2018లో అమెరికా బార్డర్ లో పట్టుబడిన నకిలీ మందుల్లో ఎక్కువ శాతం చైనా, హాంకాంగ్ ,ఇండియా, వియత్నాంల నుంచి వచ్చినవేనని చెప్పింది. ఆన్ లైన్ లోనూ నకిలీల అమ్మకం ఎక్కువైందని, ముఖ్యంగా ఇండియా, చైనాలో ఇది ఎక్కువుందని హెచ్చరించింది. మరోవైపు నకిలీ మందుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల మంది మృతి చెందుతున్నారని ఇంటర్నేషనల్ పాలసీ నెట్వర్క్ వెల్లడిం చింది.
వాచ్ లిస్ట్ లో ఇండియా
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్ ) నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు రావడంతో ఇండియా సహా 10 దేశాలను యూఎస్ ‘ప్రియారిటీవాచ్ లిస్టు’లో చేర్చింది. పాకిస్థాన్ సహా మరో 25దేశాలను ‘వాచ్ లిస్టు’లో పెట్టింది. మరోవైపు ఐపీ సమస్యను ఎదుర్కోడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నాన్నీ యూఎస్ టీఆర్ పొగిడింది. కొంతకాలంగా ఐపీ ప్రొటెక్షన్ ను ఇండియా ప్రమోట్ చేస్తోందని చెప్పింది. యూఎస్, ఇండియా ట్రేడ్ ఫోరం ద్వారా ఐపీ విషయాల్లో ఇండియాకు సాయం చేస్తామంది.అమెరికాతో వ్యాపారం చేస్తున్న ఇండియా సహా ఇతరదేశాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తాము గమనిస్తూనే ఉంటామని చెప్పింది.
20 కాదు 10 శాతమే: అధికారి
అమెరికా విమర్శలను కేంద్ర ఆరోగ్య, సంక్షేమశాఖ అధికారి ఒకరు కొట్టిపారేశారు. లెక్కలను పెంచి చూపిస్తున్నారని మండిపడ్డారు . ఇండియాలోనకిలీ మందుల సమస్య ఉన్నది నిజమేనని, కానీ అది మొత్తం మందుల్లో 10 శాతమేనని చెప్పారు .దీనికి చెక్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో బ్లాక్ చెయిన్, క్యూఆర్ టెక్నాలజీ వాడుతున్నామన్నారు.

