
హైదరాబాద్ లో యువతి మిస్సింగ్ ... విషాదాంతంగా ముగిసింది. అదృశ్యమైన యువతి మృతదేహాన్ని పోలీసులు దుర్గం చెరువులో గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ... మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్ మారేడు పల్లికి చెందిన బి. సుష్మ (27) అనే మహిళ కనపడటం లేదని ఆమె తండ్రి ఈ రోజు ( జూన్ 19) తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె HITEC సిటీలోని డైబోల్డ్/నిక్స్డార్ఫ్లో పని చేస్తుంది. ప్రైవేట్ ఎంప్లాయిగా పనిచేస్తున్న ఆమె.. నిన్న ( జూన్ 18) మధ్యాహ్నం 3 గంటలకు ఆఫీసుకు వెళ్లింది. రాత్రి 1 గంటలకు ఇంటికి రావలసిన సుష్మ రాకపోవండంతో .. ఆమె తండ్రి కంపెనీ మేనేజర్ ను సంప్రదించగా.. నిన్న ( జూన్ 18) రాత్రి 8:30 గంటలకే ఆఫీసు నుండి బయలుదేరిందని చెప్పారని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సుష్మ తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ( జూన్ 19) ఉదయం 7 గంటల ప్రాంతంలో దుర్గం చెరువులో ఓ మహిళ మృతదేహం తేలుతూ ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహం అదృశ్యమైన సుష్మాదేనని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.