హైదరాబాద్: యువతి మిస్సింగ్ కేసు నమోదు .. దుర్గం చెరువులో మృతదేహం లభ్యం

హైదరాబాద్:  యువతి మిస్సింగ్ కేసు నమోదు .. దుర్గం చెరువులో మృతదేహం లభ్యం

హైదరాబాద్​ లో యువతి మిస్సింగ్​ ... విషాదాంతంగా ముగిసింది.  అదృశ్యమైన యువతి మృతదేహాన్ని  పోలీసులు దుర్గం చెరువులో గుర్తించారు.  దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ... మాదాపూర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఈస్ట్​ మారేడు పల్లికి చెందిన బి. సుష్మ (27) అనే మహిళ కనపడటం లేదని ఆమె తండ్రి ఈ రోజు ( జూన్​ 19) తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆమె  HITEC సిటీలోని డైబోల్డ్/నిక్స్‌డార్ఫ్‌లో పని చేస్తుంది. ప్రైవేట్​ ఎంప్లాయిగా పనిచేస్తున్న ఆమె.. నిన్న ( జూన్​ 18) మధ్యాహ్నం 3 గంటలకు ఆఫీసుకు వెళ్లింది.  రాత్రి 1 గంటలకు ఇంటికి రావలసిన సుష్మ రాకపోవండంతో .. ఆమె తండ్రి కంపెనీ మేనేజర్​ ను సంప్రదించగా.. నిన్న ( జూన్​ 18)  రాత్రి 8:30 గంటలకే ఆఫీసు నుండి బయలుదేరిందని చెప్పారని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

సుష్మ తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్​ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ( జూన్​ 19) ఉదయం 7 గంటల ప్రాంతంలో దుర్గం చెరువులో ఓ మహిళ మృతదేహం తేలుతూ ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహం అదృశ్యమైన సుష్మాదేనని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.