
- డ్వాక్రా మహిళలకు టోకరా
- రూ.28.30 లక్షలు సొంత ఖాతాలోకి ట్రాన్స్ఫర్
- బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగిన మహిళలు
ఎర్రుపాలెం, వెలుగు: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో డ్వాక్రా మహిళలకు ఓ వ్యక్తి టోకరా ఇచ్చాడు. సీసీ సంతకాన్ని ఫోర్జరీ చేసి వెంకటాపురం గ్రామంలోని 30 గ్రూపులకు చెందిన 300 మంది సభ్యులకు చెందిన రూ28.30 లక్షలు డ్రా చేసుకొని తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న డ్వాక్రా సభ్యులు కుంపటి కన్నయ్యను నిలదీయగా, డబ్బులు తన వ్యక్తిగత అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయగా డ్రా చేశానని తెలిపాడు.
దీంతో ఆగ్రహించిన మహిళలు మంగళవారం బ్యాంక్ వద్ద ఆందోళన చేశారు. బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ్ డబ్బులు కాజేసిన కన్నయ్యను ఈ విషయమై నిలదీయగా, డబ్బులు సొంతానికి వాడుకున్నట్లు అంగీకరించాడు. ఇదిలాఉంటే కన్నయ్య భార్య శిరీష వెంకటాపురం గ్రామంలో వీవోగా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ ను వివరణ కోరగా.. కన్నయ్య డ్వాక్రా సభ్యులకు సంబంధించిన లావాదేవీలను కొనసాగిస్తాడని, అదే నమ్మకంతో లోన్ అందిస్తే నిందితుడు తన స్వప్రయోజనానికి ఆ నగదును వాడుకున్నట్లు తెలిపారు.