శివసేనలోని రెండు వర్గాలకు కొత్త పేర్లు

శివసేనలోని  రెండు వర్గాలకు కొత్త పేర్లు

రెండుగా చీలిపోయిన శివసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పేర్లను కేటాయించింది. సీఎం ఏక్‭నాథ్ షిండే వర్గానికి ‘బాలాసాహేబాంచి శివసేన’ అని, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పేరును కేటాయించింది. ఠాక్రే నేతృత్వంలోని సేనకు ఎన్నికల సంఘం పార్టీ చిహ్నంగా కాగడ (మషాల్) ను కేటాయించింది. అయితే షిండే వర్గానికి మాత్రం పార్టీ గుర్తును ఇంకా కేటాయించలేదు. దానికి బదులుగా రేపు ఉదయం 10 గంటలలోపు మూడు తాజా ఆప్షన్లు ఇవ్వాలని ఎన్నికల సంఘం షిండే వర్గాన్ని కోరింది.

అంతకుముందు, రెండు వర్గాలు ప్రతిపాదించిన గదా, త్రిశూలం మతపరమైన చిహ్నాలు కావడంతో ఎన్నికల సంఘం వాటిని తిరస్కరించింది. రాజకీయ పార్టీలకు మతపరమైన చిహ్నాలను కేటాయించడాన్ని ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకించింది. ముంబైలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గంలో నవంబర్ 3న జరగనున్న ఉప ఎన్నిక కోసం కొత్త పేర్లు, గుర్తులను ఎంచుకోవలసిందిగా  భారత ఎన్నికల సంఘం ఠాక్రే, షిండే వర్గాలను కోరింది.

ఏక్ నాథ్ షిండే ఫిర్యాదుతో.. 

నవంబర్ 3న తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ జరగనుంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లాత్కే ఆకస్మిక మృతితో తూర్పు అంధేరి అసెంబ్లీ నియోజకవర్గానికి బై పోల్ వచ్చింది. బై పోల్ కోసం ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన వర్గం నుంచి రమేష్ లాత్కే భార్య రుతుజ పోటీ చేస్తున్నారు. ఇక ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ముర్జీ పటేల్ పేరును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈనేపథ్యంలో పార్టీ గుర్తు అంశాన్ని తొలుత  శివసేన చీలికవర్గం సారథి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అక్టోబరు 4న కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. శివసేన పార్టీ గుర్తు తమదేనని.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేని ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాన్ని తూర్పు అంధేరి బైపోల్ లో వినియోగించకుండా చూడాలని కోరారు. స్పందించిన ఈసీ.. శివసేనలోని రెండు వర్గాలు దీనిపై అక్టోబరు 7కల్లా  లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచించింది.  ఈ వివరణలను పరిశీలించిన ఈసీ.. ప్రస్తుతానికి తూర్పు అంధేరి బై పోల్ కోసం శివసేన గుర్తు ‘విల్లు బాణం’ ను శివసేనలోని ఏ వర్గం కూడా వినియోగించరాదని ఆదేశించింది. కొత్త గుర్తును, కొత్త పేరును ఎంపిక చేసుకొని పోటీ చేయాలని నిర్దేశించింది. రెండు వర్గాలు అక్టోబరు 10 కల్లా మూడు పేర్లు, గుర్తులను సూచించాలని..  వాటి నుంచే చెరో దాన్ని కేటాయిస్తామని వెల్లడించింది.

కొత్త గుర్తుల ప్రతిపాదన..

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం  ‘శివసేన బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును మొదటి చాయిస్ గా, ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ పేరును రెండో చాయిస్ గా, ‘శివసేన ప్రబోధన్కార్ ఠాక్రే’ పేరును మూడో చాయిస్ గా పేర్కొన్నట్లు తెలిసింది. త్రిశూలం, ఉదయించే సూర్యుడు, కాగడాలలో ఒకదాన్ని బై పోల్ కోసం పార్టీ గుర్తుగా కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని  కోరింది. అయితే శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పేరును ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఈసీ కేటాయించింది.