- కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై సీరియస్
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 1న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సురేఖ చేసిన వ్యాఖ్యలను ఈసీ తప్పుపట్టింది. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు జాగ్రత్తగా మాట్లాడాలని ఆమెను హెచ్చరించింది. ఇతర పార్టీలను, నేతలు విమర్శించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా, మంత్రిగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. ఈనెల 1న వరంగల్లో మీడియా సమావేశంలో సురేఖ మాట్లాడుతూ..
‘‘కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ తో ఎంతో మంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారు. ఎంతో మంది అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు కోల్పోయి జైలుకు పోయేందుకు కారణమయ్యారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చాడు. అధికారం లేకనే కేసీఆర్, కేటీఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారు. ఇప్పటికే కేటీఆర్ చెల్లె శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్లారు” అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ ఈనెల 6న ఈసీకి ఫిర్యాదు చేశారు.
దీనికి సంబంధించిన వీడియో పుటేజీ, ఇతర సాక్ష్యాధారాలను అందించారు. అలాగే ఈసీ.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వారా నివేదిక తెప్పించుకుంది. సురేఖ చేసిన వ్యాఖ్యలను జిల్లా ఎన్నికల అధికారి ఇంగ్లిష్ లోకి అనువదించి పంపించారు. ఆమె వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ.. మంత్రికి హెచ్చరికలు జారీ చేసింది. అలా మాట్లాడడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని, ఇక ముందు జాగ్రత్తగా మాట్లాడాలని మంత్రికి సూచించింది.