- త్వరలో అందుబాటులోకి రిమోట్ ఓటింగ్
- ఆర్వీఎం నమూనాను డెవలప్ చేసిన ఎన్నికల కమిషన్
- జనవరి 16న డెమో.. అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం
- అందరూ ఓకే అంటే సొంతూరికి వెళ్లకుండానే ఓటేసే చాన్స్
న్యూఢిల్లీ: ఓటింగ్ పర్సంటేజ్ను పెంచే దిశగా కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ముందడుగు వే సింది. ఉద్యోగులు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సొంతూరికి వెళ్లకుండానే ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఆర్వీఎం) నమూనాను డెవలప్ చేసింది. ఆర్వీఎంపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా జనవరి 16న ప్రత్యేకంగా డెమో ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీన్నింటికీ ఆహ్వానం పంపింది. అందరూ సానుకూలంగా అభిప్రాయాలను తెలిపితే.. రిమోట్ ఓటింగ్ను ఈసీ అమలు చేస్తుంది.
కాన్సెప్ట్ నోట్రిలీజ్
రిమోట్ ఓటింగ్కు సంబంధించి ఈసీ గురువా రం ఒక కాన్సెప్ట్ నోట్ను విడుదల చేసింది. ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఈ ఆర్వీఎంను డిజైన్ చేసిం ది. ఒకే పోలింగ్ బూత్ ద్వారా 72 నియోజకవర్గాలను కవర్ చేయవచ్చని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నోట్ ప్రకారం.. నమూనా ఆర్వీ ఎం పనితీరును తెలియజేసేందుకు జనవరి 16 న డెమో ఏర్పాటు చేసింది. మొత్తం 8 గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 57 రాష్ట్ర పార్టీలను దీనికి ఆహ్వానించింది. ఈసీ సాంకేతిక నిపు ణుల కమిటీ కూడా హాజరుకానుంది. రిమోట్ ఓటింగ్ అమలు చేయడంలో చట్టపరమైన, పరిపాలన, సాంకేతిక సవాళ్లపై పార్టీల అభిప్రా యాలను కోరింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా, ఈసీ రిమోట్ ఓటింగ్ అమలు ప్రక్రియను ముందుకు తీసుకువెళుతుంది. దీని ద్వారా సొంత నియోజకవర్గానికి వెలుపల ఉండే పోలింగ్ స్టేషన్లలో ఓటును ఉపయోగించుకోవచ్చు. చట్టంలో, పరిపాలనా విధానాల్లో అవసరమైన మార్పులు, వలసదారులు ఓటు వేసే విధానం సహా పలు సమస్యలపై జనవరి 31 అభిప్రాయాలను తెలపాలని పార్టీలను ఈసీ కోరింది.
ఓటింగ్ శాతం పెంచేందుకే..
తరచుగా ఇల్లు మారడం, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చిన ప్రాంతాలతో తగినంత సామాజి క, భావోద్వేగ సంబంధం లేకపోవడం, సొంతూ రులో ఓటర్ల జాబితాలో తమ పేరును తొలగించడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాల వల్ల వలసదారులు తమ పని ప్రదేశంలో ఓటు నమోదు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎన్నికల టైంలో వివిధ కారణాలతో వీరు సొంతూరికి వెళ్లకపోవడంతో ఓటింగ్ శాతం తగ్గుతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. 30 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయలేదు. వివిధ రాష్ట్రాలు, యూటీల్లో భిన్నమైన ఓటింగ్ శాతం నమోదుకావడంపై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. చదువు, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది సొంతూర్లను వదిలివెళ్తున్నారని, దేశంలో దాదాపు 85 శాతం మంది ఇలాంటి వారేనని పేర్కొంది.
రిమోట్ ఓటింగ్ కీలక అడుగు: సీఈసీ రాజీవ్కుమార్
ఎన్నికల ప్రజాస్వామ్యంలో యూత్, అర్బన్ జనాల భాగస్వామ్యాన్ని పెంచేదిశలో రిమోట్ ఓటింగ్ ఒక కీలకమైన అడుగని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన, విశ్వసనీయమైన, అందుబాటులో ఉండే సాంకేతిక పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో రిమోట్ పోలింగ్ స్టేషన్లలో ఓటు వేసేందుకు వీలుగా ఎం3(మార్క్ 3) ఈవీఎం నమూనాను తెరపైకి తెచ్చారు. ఇది అమలులోకి వస్తే వలసదారులకు సంబంధించి సామాజికంగా గొప్ప నాంది కాబోతోందని ఈసీ పేర్కొంది. రిమోట్ ఓటింగ్ను ప్రవేశపెట్టేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం–1950, 1951, ఎన్నికల నియమావళి-1961, ఎన్నికల నమోదు నియమాలు–1960ను సవరించాల్సి ఉంటుంది. రిమోట్ బూత్లలో పోలైన ఓట్ల లెక్కింపు, ఇతర రాష్ట్రాల్లో రిటర్నింగ్ అధికారికి వాటిని పంపడం సాంకేతికంగా సవాలేని ఈసీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)తో పోలిస్తే ఆర్వీఎంలను స్థిరమైన, ఫెయిల్ప్రూఫ్, సమర్థవంతమైన స్టాండ్-అలోన్ సిస్టంగా అభివృద్ధి చేస్తారని అంటున్నారు. ఇవి ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడవు.