హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ దేశవ్యాప్తంగా మరోసారి తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్ సహా హైదరాబాద్లోని 35 ప్రాంతాల్లో శుక్రవారం సోదాలు జరిపింది. తెల్లవారుజామునే ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ నుంచి బయలుదేరిన ఈడీ బృందాలు.. ఆయా ప్రాంతాల్లో సాయంత్రం వరకు సోదాలు జరిపాయి. కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాయి. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో ఈడీ టీమ్స్ తనిఖీలు చేపట్టాయి.
జూబ్లీహిల్స్లోని ఓ పేపర్ కార్యాలయంలో ఉన్న ఓ ఇంగ్లీష్ టీవీ చానల్ ఆఫీసుతో పాటు మాదాపూర్ లోని దాని చైర్మన్, ఎండీల ఇండ్లలో సోదాలు జరిపాయి. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన తనిఖీలు.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా ఈడీ అధికారులు పలు డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఓ లిక్కర్ కంపెనీకి చెందిన డైరెక్టర్ అభిషేక్రావు అకౌంట్ నుంచి చానల్ అకౌంట్కి రూ.కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు, మళ్లీ చానల్ అకౌంట్ నుంచి అభిషేక్ రావు అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్లుగా ఈడీ గుర్తించిందని సమాచారం.
మహేంద్రు స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు..
పోయిన నెల 27, 28 తేదీల్లో బిజినెస్ మెన్ విజయ్నాయర్ను సీబీఐ, మీడియేటర్ సమీర్ మహేంద్రును ఈడీ అరెస్ట్ చేశాయి. సమీర్ మహీంద్రును 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ఈడీ విచారించింది. సమీర్ స్టేట్మెంట్ ఆధారంగా అభిషేక్ రావు అకౌంట్స్పై ఫోకస్ చేసింది. సమీర్ మహేంద్రుకు వెళ్లిన డబ్బుకు సంబంధించిన అకౌంట్స్ లింకులు హైదరాబాద్లోని ఓ ఇంగ్లీష్ చానల్ అకౌంట్స్తో కనెక్ట్ అయినట్లు గుర్తించింది. అభిషేక్రావు నుంచి ఇంగ్లీష్ చానల్కి వెళ్లిన డబ్బు ఎంత? మళ్లీ అక్కడి నుంచి అభిషేక్రావు అకౌంట్కి వచ్చిన డబ్బు ఎంత? అనే వివరాలను ఈడీ అధికారులు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన పలువురు లిక్కర్ వ్యాపారుల వివరాలనూ ఈడీ సేకరించినట్లు సమాచారం. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలువురు రాజకీయ, వ్యాపారవేత్తలకు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
సమీర్ మహేంద్రుతో లింకులు..
సీబీఐ నమోదు చేసిన కేసులో హైదరాబాద్కు చెందిన రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నారు. ఆయన రాబిన్ డిస్టిలరీస్, డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్గా ఉన్నారు. అదే కంపెనీలో అభిషేక్రావు, ప్రేమ్సాగర్ కూడా డైరెక్టర్స్. లిక్కర్ కేసులో మీడియేటర్గా వ్యవహరించిన ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రుకు రామచంద్ర పిళ్లైతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి నుంచి ఢిల్లీకి చెందిన విజయ్ నాయర్కు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్లు చేరినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ కేసులో మనీ లాండరింగ్పై ఈడీ ఆధారాలు సేకరిస్తోంది. 13కు పైగా షెల్ కంపెనీల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది. రామచంద్ర పిళ్లై స్టేట్మెంట్ ఆధారంగా మరికొన్ని ఆధారాలు సేకరించింది.
హార్డ్ డిస్క్ లు, ఫోన్లే కీలకం..
లిక్కర్ కంపెనీలు, షెల్ కంపెనీల ముసుగులో జరుగుతున్న మనీ లాండరింగ్ పై ఈడీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీల అకౌంట్స్ను సీజ్ చేసినట్లు సమాచారం. అభిషేక్ రావు, ప్రేమ్సాగర్ల నుంచి జరిగిన అనుమానిత ట్రాన్సాక్షన్ల ఆధారంగా ఇప్పటికే హైదరాబాద్కు చెందిన 8 మంది వ్యాపారవేత్తలను ఈడీ విచారించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, లిక్కర్ స్కామ్ సమయంలో బ్యాంకుల నుంచి రూ.కోట్లలో విత్డ్రా జరిగిన అకౌంట్లను ఈడీ గుర్తించినట్లు తెలిసింది. రెయిడ్స్లో స్వాధీనం చేసుకున్న హార్డ్డిస్క్లు, మొబైల్ ఫోన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ల వివరాలు దర్యాప్తులో కీలకంగా మారాయి. అందుకే హార్డ్డిస్క్ల నుంచి డిలీట్ చేసిన అకౌంట్స్ డేటాను ఈడీ రిట్రీవ్ చేస్తున్నట్లు తెలిసింది.
కేంద్రానివి డర్టీ పాలిటిక్స్: కేజ్రీవాల్
ఈడీ సోదాలపై ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం డర్టీ పాలిటిక్స్ చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. ‘‘మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ సంపాదించేందుకు 500కు పైగా తనిఖీలు చేపట్టారు. మూడు నెలల నుంచి 300 మంది సీబీఐ/ఈడీ అధికారులు 24 గంటలూ పని చేస్తున్నారు. కానీ వాళ్లకేమీ దొరకలేదు. ఎందుకంటే ఎలాంటి తప్పు జరగలేదు. కేంద్రం తన డర్టీ పాలిటిక్స్ కోసం ఎంతోమంది అధికారుల విలువైన టైమ్ ను వృథా చేస్తోంది. ఇలాంటి దేశం ఎలా ముందుకు వెళ్తుంది?’’ అని ఆయన ట్వీట్ చేశారు.