హైదరాబాద్, వెలుగు : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి రెండో రోజైన శనివారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కి వచ్చారు. అధికారులకు డాక్యుమెంట్స్, బ్యాంక్స్టేట్మెంట్స్ అందజేశారు. జేసీ అందించిన పత్రాల ఆధారంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8గంటల దాకా ఈడీ అధికారులు ప్రశ్నించారు. బీఎస్-3 వెహికల్స్ను బీఎస్4గా మార్చి రిజిస్ట్రేషన్స్ చేశారన్న కేసులో జేసీ ప్రభాకర్రెడ్డిపై ఏపీలో కేసులు నమోదయ్యాయి.
తాడిపత్రి, అనంతపూర్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ రెండు రోజులుగా విచారిస్తున్నది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, ఛత్తీస్గడ్లలో రిజిస్ట్రేషన్ చేసిన వెహికల్స్, ఆర్టీఏ అందించిన వివరాలతో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే స్క్రాప్ వెహికల్స్ కొనుగోలు చేసిన డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పరిశీలించారు. హవాలా రూపంలో డబ్బులు చెల్లించారా.. అనే కోణంలో జేసీని ప్రశ్నించినట్లు తెలిసింది.