
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, కాండ్లా పోర్టులో రద్దీ తగ్గడమే కారణం
- గత మూడు రోజుల్లో అన్ని రకాల వంట నూనె ధరల్లో కేజీకి రూ.3 తగ్గుదల
- ఇండియా వంట నూనె దిగుమతుల్లో తగ్గుతున్న పామాయిల్ వాటా
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుండడం, కాండ్లా పోర్టు (గుజరాత్) లో కార్గో రద్దీ తగ్గడంతో వంట నూనె ధరలు దిగొస్తున్నాయి. గత మూడు రోజుల్లో దిగుమతైన పామాయిల్ ధర టన్నుకు 30 డాలర్లు (రూ.2,580) తగ్గి 1,060 డాలర్లు (రూ.91,160) పలుకుతోంది. సోయా ఆయిల్ టన్నుకు 20 డాలర్లు (రూ.1,720) తగ్గి 1,150 డాలర్ల (రూ.98,900) కు, సన్ఫ్లవర్ ఆయిల్ టన్నుకు 10 డాలర్లు (రూ.860) తగ్గి 1,200 డాలర్ల (రూ.1,03,200) కు చేరాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
“ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య టెన్షన్ పెరిగినప్పుడు ధరలు పెరిగాయి. కాండ్లా పోర్టులో రద్దీ వల్ల కూడా దిగుమతి చేసుకున్న వంట నూనె ప్రజలకు వేగంగా అందుబాటులోకి రాలేదు. దీనివల్ల వంట నూనె ధరలు మరింత పెరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. ధరలు తగ్గుతున్నాయి” అని ముంబై ఆధారిత వంట నూనెల ట్రేడింగ్ కంపెనీ సన్విన్ గ్రూప్ సీఈఓ సందీప్ బజోరియా చెప్పారు. “గత రెండు రోజుల్లో అన్ని రకాల వంట నూనెల ధరలు కిలోకు 3 రూపాయలు తగ్గాయి. ఇప్పుడు వీటి కొరత లేదు. ధరలు సగటున మరో 2–-3శాతం తగ్గొచ్చు” అని జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌధరి అన్నారు.
ఇరాన్ కూడా ఇండోనేషియా, మలేసియా నుంచి పామాయిల్ను కొంటోందని పేర్కొన్నారు. “ఇరాన్–-ఇజ్రాయెల్ టెన్షన్ పెరగడంతో ఇండోనేషియా, మలేసియా నుంచి పామాయిల్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి. దీనివల్ల ఈ రెండు ఆసియా దేశాల్లో పామాయిల్ నిల్వలు భారీగా ఉన్నాయి. ఫలితంగా పామాయిల్ ధరలు తగ్గొచ్చు. ఈ ఆయిల్ను ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ సెక్టార్ ఉపయోగిస్తాయి” అని చౌధరి వివరించారు. కాండ్లా పోర్టులో రద్దీ 15–-20 రోజుల నుంచి 5–-6 రోజులకు తగ్గింది. “రెండు ఓడలు బెర్త్లో ఉన్నాయి. నాలుగు ఓడలు వచ్చి బెర్త్ కోసం వెయిట్ చేస్తున్నాయి. జూన్ 27 నుంచి జులై 10 మధ్య 12 ఓడలు రావాల్సి ఉంది” అని ఇమామి అగ్రోటెక్ సీఈఓ, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ దేశాయ్ పేర్కొన్నారు.
వంట నూనె దిగుమతులు ఇలా..
పామాయిల్ మలేసియా, ఇండోనేషియా నుంచి వస్తోంది. సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ను అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటోంది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) డేటా ప్రకారం, ఈ ఏడాది మే నెలలో భారతదేశ వంట నూనెల దిగుమతులు వరుసగా ఆరవ నెల కూడా 22.36శాతం (ఏడాది లెక్కన) తగ్గి 11.9 లక్షల టన్నులు అయ్యాయి. పామాయిల్ ఇంపోర్ట్స్ 22.32శాతం తగ్గి 5.92 లక్షల టన్నులకు (గత ఏడాది 7.63 లక్షల టన్నులు) పడ్డాయి.
సోయాబీన్ ఆయిల్ ఇంపోర్ట్స్ 23శాతం తగ్గి 3.98 లక్షల టన్నులుగా, సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్స్ 55.30శాతం తగ్గి 1.83 లక్షల టన్నులుగా రికార్డయ్యాయి. వంట నూనె దిగుమతుల్లో పామాయిల్ వాటా తగ్గుతోంది. నవంబర్ 2024లో మొదలైన ప్రస్తుత ఆయిల్ ఇయర్లో గత ఏడు నెలల్లో పామాయిల్ వాటా 58శాతం నుంచి 42శాతానికి తగ్గగా, సన్ఫ్లవర్, సోయాబీన్ లాంటి నూనెల వాటా 42శాతం నుంచి 57శాతానికి పెరిగింది.