
- వృద్ధ దంపతులను మోసగించిన దుండగుడు
- వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ లో ఘటన
నర్సంపేట, వెలుగు : పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి వృద్ధురాలి పుస్తెల తాడుతో పరారైన ఘటన వరంగల్జిల్లాలో జరిగింది. బాధితులు తెలిపిన ప్రకారం.. నర్సంపేట టౌన్లోని మార్కండేయ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు మాటేటి సరోజన, సర్వేశం కూరగాయలు కొనేందుకు ఆదివారం మధ్యాహ్నం వారాంతపు సంత జరిగే అంగడి సెంటర్కు వెళ్లారు. వారి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ‘‘ ఇప్పుడే మీ ఇంటికి వెళ్లి వస్తున్నా.. మీకు పెన్షన్ మంజూరైంది. వాసవీ కళ్యాణ మండపంలో ఆఫీసర్ల మీటింగ్నడుస్తోంది’’ అంటూ మాయమాటలు చెప్పి నమ్మించాడు.
ఫొటో తీయాలని బస్టాండ్సమీపంలోని ఓ స్కూల్ వద్దకు తీసుకెళ్లాడు. ఫొటో దిగాలంటే మెడలోని పుస్తెలతాడు తీయాలని చెప్పడంతో సరోజన తీసి అతని చేతిలో పెట్టింది. ఫొటో తీసిన అనంతరం దుండగుడు పెన్షన్ ఫామ్ ఇచ్చి జిరాక్స్ తీసుకురావాలంటూ వృద్ధ దంపతులను సూచించాడు. వారు జిరాక్స్షాపు వద్దకు వెళ్లి తిరిగి వచ్చే సరికి 3 తులాల పుస్తెలతాడుతో పరారయ్యాడు. మోసపోయామని తెలుసుకుని వృద్ధ దంపతులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.